1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 13 ఫిబ్రవరి 2021 (12:47 IST)

తెలంగాణలో జూలై 5 నుంచి ఎంసెట్

ఎంసెట్‌తోపాటు ఈసెట్‌, పీజీఈసెట్‌ తేదీలను తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. బీఈ, బీటెక్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎంసెట్‌ను జూలై 5 నుంచి 9 వరకు నిర్వహించాలని ఉన్నత విద్యామండలి అధికారులు నిర్ణయించారు.

జేఈఈ మెయిన్‌ పరీక్షలు మే 24న ప్రారంభమై 28తో ముగుస్తుండగా.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ జూలై-3న పూర్తవనుంది. ఈ పరీక్షలన్నీ పూర్తయ్యాక ఎంసెట్‌ నిర్వహించాలని నిర్ణయించిన అధికారులు.. అందుకు తగ్గట్టుగా తేదీలను ప్రకటించారు. ఈసారి ఎంసెట్‌ ఇంజనీరింగ్‌, మెడికల్‌(వెటర్నరీ, అగ్రికల్చర్‌) పరీక్షలను వేర్వేరుగా నిర్వహిస్తామని తెలంగాణ ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు పాపిరెడ్డి తెలిపారు.
 
ఈసెట్‌ను జూలై ఒకటిన నిర్వహిస్తారు. ఎంఇ, ఎంటెక్‌, ఎం-ఫార్మసీ, ఎం-ఆర్కిటెక్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు పీజీఈసెట్‌ను జూన్‌-20 నుంచి నిర్వహిస్తారు ఐసెట్‌, ఎడ్‌సెట్‌, లాసెట్‌, పీఈసెట్‌ల తేదీలను తర్వాత ప్రకటిస్తామని పాపిరెడ్డి తెలిపారు.

కాగా, ఎంసెట్‌, ఈసెట్‌ పరీక్షల నిర్వహణ బాధ్యతను జేఎన్‌టీయూకు అప్పగించారు. ఎంసెట్‌ కన్వీనర్‌గా రెక్టార్‌ ఆచార్య గోవర్ధన్‌ను, ఈసెట్‌ కన్వీనర్‌గా పరీక్షల విభాగం డైరెక్టర్‌ ఆచార్య వెంకటరమణారెడ్డిని నియమించారు. అలాగే పీజీఈసెట్‌ పరీక్షను ఓయూ నిర్వహించనుంది.

కన్వీనర్‌గా ఓయూ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగాధిపతి పి.లక్ష్మీనారాయణ వ్యవహరిస్తారు. ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘టీఎస్‌ ఐసెట్‌’ కన్వీనర్‌గా ప్రొఫెసర్‌ కె.రాజిరెడ్డి నియమితులయ్యారు.