శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 6 మే 2021 (20:36 IST)

తెరాసకు గుడ్‌బై చెప్పనున్న ఈటల.. ఎమ్మెల్యే సభ్యత్వానికికూడా...

తెలంగాణ రాష్ట్ర సమితిలో కీలక నేతగా వ్యవహరించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇపుడు తన భవిష్యత్ కార్యాచరణపై దృష్టిసారించారు. ఇందులోభాగంగా, తెరాస అధిష్టానం తనపై చర్యలు తీసుకోకముందే ఆయన స్వయంగానే పార్టీకి రాజీనామా చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే, శాసనసభ సభ్వత్వానికి కూడా రాజీనా చేయొచ్చన్న ఊహాగానాలు వస్తున్నాయి. 
 
ఇటీవల ఈటల భూకబ్జాలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో ఆయనను మంత్రివర్గం నుంచి సీఎం తొలగించారు. ఆ తర్వాత ఆయన హుజురాబాద్‌కు వెళ్లి అనుచరులను కలవడం, మీటింగ్‌లు ఏర్పాటు చేస్తుండటంతో అధిష్టానం మరింత సీరియస్ అవుతోంది. 
 
అదేసమయంలో ఈటలను టార్గెట్ చేస్తూ మంత్రులు, ఆ పార్టీ నేతలు కొందరు మీడియా మీట్‌లు పెట్టి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించడంతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా అనర్హుడిగా ప్రకటించాలని కరీంనగర్ జిల్లాకు చెందిన కొందరు నేతలు డిమాండ్ చేస్తున్నారు. 
 
ఇదే విషయాన్ని అసెంబ్లీ స్పీకర్‌‌కు ఫిర్యాదు చేయాలని కూడా జిల్లా నేతలు యోచిస్తున్నారు. కాగా.. ఇప్పటికే ఈటలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని హైకమాండ్‌కు కరీంనగర్ జిల్లా నేతలు లేఖ ఇచ్చారు.
 
ఇదిలావుంటే.. ఎమ్మెల్యేగా రాజీనామా చేసి, తెరాస నుంచి బయటికి వచ్చాక ఈటల కొత్త పార్టీ పెడతారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. కానీ, ఇంట గెలిచాకే రచ్చ గెలవాలనే ఆలోచనతో ఆయన ఉన్నారని తెలుస్తోంది. 
 
రాజీనామాతో హుజూరాబాద్‌కు ఉప ఎన్నిక తీసుకొచ్చి, అక్కడ గెలిచి టీఆర్‌ఎస్‌కు సవాల్‌ విసరాలని, ఆపై కలిసివచ్చే వ్యక్తులు, శక్తులతో కలిసి ముందుకు సాగాలనేది ఉద్దేశంగా చెబుతున్నారు.