1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 మే 2021 (16:35 IST)

తెలంగాణలో సంపూర్ణ లాక్డౌన్ విధించం.. కరోనాకు మంచిగా చికిత్స చేస్తాం...

కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణా ఒకటి. ఈ వైరస్ వ్యాప్తికి అడ్డకట్ట వేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలైన చర్యలు తీసుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో కరోనా మహమ్మారిని అదుపు చేసేందుకు పూర్తిస్థాయి లాక్డౌన్ విధించబోతున్నారంటూ వచ్చిన వార్తలపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్పందించారు. 
 
రాష్ట్రంలో సంపూర్ణ లాక్డౌన్ విధించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అయితే, వారాంతపు లాక్డౌన్ విషయం గురించి మాత్రం ఆలోచిస్తున్నట్టు చెప్పారు. లాక్డౌన్ విధించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండబోదన్నారు. లాక్డౌన్ విధించి ప్రజలను ఇబ్బంది పెట్టడం కంటే, కరోనా వైరస్ బారినపడినవారికి మంచి చికిత్స అందించడం ఎంతో ముఖ్యమన్నారు.
 
రాష్ట్రంలో కరోనా వైరస్ పూర్తిగా అదుపులో ఉందని, అతి త్వరలోనే సాధారణ పరిస్థితులు ఏర్పడతాయన్నారు. పలు రాష్ట్రాలు లాక్డౌన్ విధించడంపై సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. అక్కడి స్థానిక పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాలు ఆ నిర్ణయం తీసుకున్నాయన్నారు. 
 
లాక్డౌన్ వల్ల ప్రజలు జీవనోపాధిని కోల్పోతారన్నారు. అయితే, రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్డౌన్ అవసరమైనప్పుడు మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ తగిన నిర్ణయం తీసుకుంటారని సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు.
 
కాగా, తెలంగాణలో కొత్తగా మరో 6,361 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో 51 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 2,527 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,69,722కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,89,491 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 2,527గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 77,704 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 1,225 మందికి క‌రోనా సోకింది.