ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 5 మే 2021 (13:37 IST)

తెలంగాణ ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోవిడ్ వ్యాక్సినేషన్‌కు అనుమతి... ఇవీ రేట్లు - ప్రెస్ రివ్యూ

ప్రైవేటు ఆస్పత్రుల్లో 45 ఏళ్లు పైబడినవారికి టీకా వేయడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతించినట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక కథనం ప్రచురించింది. తెలంగాణలో ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే, కేవలం 45 సంవత్సరాలు పైబడిన వారికే టీకాలు ఇవ్వాలని స్పష్టం చేసింది.

 
కొవిన్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవారికే టీకా ఇవ్వాలని ఆదేశించింది. 18-44 మధ్యవయస్కులకు వ్యాక్సినేషన్‌ ఇప్పుడు లేదని వెల్లడించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రజారోగ్య సంచాలకుడు (డీహెచ్‌) డాక్టర్‌ గడల శ్రీనివాసరావు మంగళవారం విడుదల చేశారు. కేంద్రం మూడోదశ టీకా మార్గదర్శకాలు విడుదల చేసిన తర్వాత రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్‌కు ప్రభుత్వం అనుమతినివ్వలేదు.

 
ప్రైవేటు ఆస్పత్రులు తమ వద్ద వేసే టీకాలను ఉత్పత్తి సంస్థల నుంచి నేరుగా కొనుగోలు చేసుకోవాలని ప్రభుత్వం తన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఇప్పటివరకు ప్రైవేటు ఆస్పత్రులు కేంద్రం సూచించిన ఖాతాలో డబ్బులు జమ చేసి.. ఆ రసీదును ప్రజారోగ్య సంచాలకుడికి ఇచ్చేవి. ఆ మొత్తానికి సరిపడ వ్యాక్సిన్‌ను ప్రైవేటు ఆస్పత్రులకు రాష్ట్ర వ్యాక్సిన్‌ స్టోరేజ్‌ సెంటర్‌ నుంచి ఇచ్చేవారు. కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌లకు ఒకే ధర చెల్లించేవారు.

 
ఒక్కో డోసుకు రూ. 150 చొప్పున చెల్లించి ప్రైవేటు ఆస్పత్రులు కొనుగోలు చేసేవి. డోసు ధరకు అదనంగా రూ.100 సర్వీస్‌ చార్జీ కింద ప్రజల నుంచి వసూలు చేసేవి. దాంతో ఒక్కో డోసు ఇప్పటివరకు రూ.250 దొరికేది. కానీ.. ఇప్పుడు ప్రైవేటు ఆస్పత్రులు నేరుగా కంపెనీల నుంచే టీకాలు కొనుక్కోవాల్సి ఉంటుందని ప్రభుత్వం చెప్పడంతో ఆ మేరకు ధరలు పెరగనున్నాయి. అంటే ప్రైవేటు టీకా కేంద్రాల్లో కొవాగ్జిన్‌ ధర ఒక్కో డోసుకు రూ.1300, కొవిషీల్డ్‌ అయితే రూ. 700 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని ఆంధ్రజ్యోతి వివరించింది.