సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...
ఒక సినిమా కథలో సత్తా ఉంటే అది కనకవర్షం కురిపిస్తుందని తాజాగా ఓ గుజరాతీ చిత్రం నిరూపించింది. కేవలం 50 లక్షల పెట్టుబడితో తీసిన చిత్రం ఏకంగా రూ.100 కోట్ల కలెక్షన్స్ దిశగా దూసుకెళుతోంది. పైగా, ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ కాదు. చెప్పుకోదగిన నటీనటులు లేరు. కానీ, రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతూ గుజరాత్ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులే ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఆ చిత్రం పేరు 'లాలో కృష్ణ సదా సహాయతే'. కేవలం రూ.50 లక్షల పెట్టుబడితో నిర్మించారు. ఈ చిత్రం ఇపుడు భారీ లాభాలను తెచ్చిపెట్టింది.
ఈ గుజరాతీ సినిమా ఏడువారాల క్రితం ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలైంది. అందుకు తగ్గట్టే తొలిరోజుల్లో దీనికి లభించిన ఆదరణ కూడా అంతంతే. క్రమంగా ఈ కథలోని బలం ఆ నోటా ఈనోటా వినిపించి, అదే పెద్ద ప్రచారమైంది. దాంతో వసూళ్లు పుంజుకున్నాయి. తొలివారం ఈ సినిమాకు రూ.26 లక్షలు రాగా.. మిగతా రెండు వారాలు లక్షల్లోనే వ్యాపారం జరిగింది. అసలు కథ నాలుగో వారం నుంచి మొదలైంది.
ఆరోవారం పూర్తయ్యే సరికి రూ.70 కోట్లకుపైగా రాబట్టింది. ఇప్పుడు ఏడోవారం విజయవంతంగా నడుస్తూ..రూ.100 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. 2019లో విడుదలైన 'చాల్ జీవీ లాయియే' ఇప్పటివరకు రూ.50 కోట్ల వరకు వసూలు చేసింది. అదే అత్యధిక వసూళ్లు సాధించిన గుజరాతీ సినిమా కావడం గమనార్హం. 'లాలో- కృష్ణ సదా సహాయతే' ఈ రికార్డును అధిగమించి, తొలి రూ.100 కోట్ల సినిమాగా చరిత్రకు సిద్ధమవుతోంది.
అంకిత్ సఖియా దర్శకత్వం వహించగా.. రీవా రచ్, శ్రుహద్ గోస్వామి, కరణ్ జోషి, మిష్టి కడేచా తదితరులు నటించారు. గుజరాత్ ప్రజలను ఇంతగా ఆకట్టుకున్న ఈ సినిమా నవంబర్ 28న దేశవ్యాప్త విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే హిందీ డబ్బింగ్ పూర్తయిందని మీడియా కథనాలు వెల్లడించాయి.