2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం "ఓజీ" అభిమానులు ఊహించినట్టే సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ యేడాదిలో ఇప్పటివరకు తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. సెప్టెంబరు 25వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 11 రోజుల్లో రూ.308 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. "రూల్స్ లేవు.. చట్టాలు లేవు... గంభీర 'లా'" మాత్రమే ఉంది. ఇతడే "ఒరిజినల్ గ్యాంగ్ స్టర్" అంటూ చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ తన ఎక్స్ ఖాతాలో సినిమా వసూళ్ళ వివరాలు ప్రకటించింది.
ఈ సినిమా విడుదల రోజే రూ.154 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన విషయం తెల్సిందే. తొలి రోజు ఈ స్థాయి కలెక్షన్లు పవన్ కళ్యాణ్ కెరీర్లోనే రికార్డు. దాదాపు రూ.300 కోట్ల కలెక్షన్లతో వెంకటేశ్ - అనిల్ రావిపూడి "సంక్రాంతికి వస్తున్నాం" ఇప్పటివరకు ఈ యేడాదిలో అగ్రస్థానంలో ఉన్న విషయం తెల్సిందే.
అయితే, "ఓజీ" మాత్రం 11 రోజుల్లోనే ఈ రికార్డును అధికమించింది. వీరాభిమాని దర్శకుడై సినిమా చేస్తే ఎలా ఉంటుందో సుజీత్ 'ఓజీ'తో నిరూపించారు. "ఓజస్ గంభీర"గా పవన్ను తెరపై స్టైలిష్గా ఆవిష్కరించారు. ఈ సినిమా దాని విజయం కేవలం ట్రైలర్ లాంటిదన్న సుజీత్.. భవిష్యత్లో దానికి రెట్టింపు సందడి ఉంటుందని ప్రీక్వెల్, సీక్వెల్ని ఖరారు చేశారు. అయితే, ప్రీక్వెల్లో పవన్ కుమారుడు అకీరా నందన్ ఉంటాడా అనే ప్రశ్నకు సుజీత్ సమాధానమిస్తూ ఇపుడే చెబితే థ్రిల్ ఉండదంటూ సమాధానం దాటవేశారు.