శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (08:04 IST)

ప్రజలని మోసం చేయడానికి కేటీఆర్ కి మనసేలా వచ్చింది? : దాసోజు శ్రవణ్

”తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యవహార శైలి నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు వుంది. కనీసం ఇంగితం లేకుండా,  ఉగ్యోగాలు కల్పించామని తప్పుడు లెక్కలు చూపిస్తూ ప్రజలని మోసం చేయడానికి మనసేలా వచ్చింది? కేటీఆర్ కి నిజాయితీ వుంటే ఉద్యోగ ఖాళీలపై  గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు రావాలి” అని సవాల్ విసిరారు ఐసీసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్.
 
గోల్కొండ కోట లాంటి ప్రగతి భవన్ లో కూర్చొని, బుగ్గ కారులో తిరుగుతూ అధికార మదంతో విర్రవీగుతున్న కేటీఆర్ కి అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగిందో సోయుందా? దాదాపు 1500 మంది బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకున్న చరిత్ర గుర్తుందా? మీ ఇంట్లో ఉద్యోగాలు పంచుకోవడానికి తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకోలేదు.

నాలుగు కోట్ల మంది ప్రజల యొక్క పిల్లలకు, యువతకు, విద్యార్ధులకు, నిరుద్యోగులకు.. ఉద్యోగాలు రావాలి, వాళ్ళ జీవితాలు బావుండాలి , తెలంగాణ ప్రజల  జీవితాల్లో వెలుగులు నిండాలనే లక్ష్యంతో ఉద్యమాలు జరిగాయి. యూనివర్శిటీల్లో విద్యార్ధులు జై తెలంగాణ అని పోరాటం చేసింది తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని. నీళ్ళు నిధులు, నియామకాలు అనే నినాదం కేటీఆర్ మర్చిపోయారా ? అని నిలదీశారు శ్రవణ్.
 
కేసీఆర్ ఇంట్లో ఉద్యోగాలు లేకపోతే ఆగమాగమైపోతారు. కేటీఆర్ చెల్లమ్మ ఎంపీ గా ఓడిపోతే ఆమెకు ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చే వరకూ కేసీఆర్ ఇంట్లో ఎవరూ నిద్రపోలేదు. ఇవాళ రాష్ట్రంలో దాదాపు నలఫై లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు కోసం ఎదురుచూస్తున్నారు.

ఇలాంటి నేపధ్యంలో మంత్రి కేటీఆర్ మాయమాటలు చెప్పి ప్రజలని మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. లక్షా ముఫ్ఫై రెండు వేల ఉద్యోగాలు కల్పించామని చెప్పి ప్రజలని మభ్య పెడుతున్నారు కేటీఆర్” అని ఆరోపించారు దాసోసు.
 
”టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, మాయమాటలు చెబుతున్న మంత్రి కేటీఆర్ ని వదిలిపెట్టే సమస్యే లేదు. కేటీఆర్ కి ఓపెన్ చాలెంజ్ చేస్తున్నా. అసలు ఖాళీలు ఎన్నో అనే అంశంపై కేటీఆర్ బహిరంగ చర్చకు 26వ తేదీ, శుక్రవారము రోజు 12 గంటలకు, గన్ పార్క్ వద్ద కేటీఆర్ కోసం ఎదురు చూస్తామని ఆయన తో పాటు గంట చక్రపాణి, విఠల్ మరియు   టిఎస్పిఎస్సి సభ్యులను తోలుకొని రావాలని అలాగే అన్ని లెక్కలతో బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు.

ఒకవేళ తను  తప్పని తేలితే తన ముక్కు నేలకు రాస్తానని చెప్పారు. . ప్రతిసారి మసిపూసి మారేడు కాయ చేసి, అడ్డదారులు తొక్కి, అక్రమమైన సొమ్ముతో ఓట్లు కొనుక్కోవచ్చు. ఏది మాట్లాడిన చలామణి అవుతుంది.  ప్రచారం చేయడానికి మీడియా వుందని నోటికొచ్చినట్లు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రజలు విడుచిపెట్టరని హెచ్చరించారు దాసోసు.
 
”2014లో తెలంగాణ రాష్ట్రం వున్న ఖాళీలు ఎన్ని ? ఈ ఆరున్నర సంవత్సరాల్లో ఉద్యోగ విరమణ వల్ల వచ్చిన ఖాళీలు ఎన్ని ? ఈ ఆరున్నర సంవత్సరాల్లో తెలంగాణలో ఏర్పడ్డ కొత్త జిల్లాలు ఎన్ని, ఆ జిల్లాల వల్ల వచ్చిన ఖాళీలు ఎన్ని ? కొత్త గ్రామ పంచాయితీలు ఎన్ని ? ఆ గ్రామ పంచాయితీల వల్ల వచ్చిన ఖాళీలు ఎన్ని ? 

ఇక 610జీవో అమలు వలన వచ్చిన ఖాళీలు .. ఇలా దాదాపు అన్నీ ఖాళీలు కలుపుకుంటే దాదాపు మూడు లక్షల ఉద్యోగాలు ఖాళీలు వున్నాయి. కానీ కేటీఆర్ ఎంగిలి మెతుకులు ఎసినట్లు , తన జేబులో సొమ్ములు తీసి ఇచ్చినట్లు .. లక్షా యాబై వేల ఉద్యోగాలకు పర్మిషన్ ఇచ్చినట్లు  ఎదో గొప్పగా చెప్పుకుంటున్నారు. అసలు ఖాళీలు ఎన్ని ? మా లెక్కల ప్రకారం మూడు లక్షల పై చిలుకు ఖాళీలు వున్నాయి.

కానీ పీఆర్సీ కోసం వేసిన మీ చెంచా కమిటీ(బిశ్వాల్ కమిటీ) ఒక లక్షా తొంబై వేల ఖాళీలు వున్నాయని చెబుతుంది. మీ చెంచా కమిటీనే ఒక లక్షా తొంబై వేల ఖాళీలు వున్నాయని చెబుతున్నపుడు.. అదేదో ఘణకార్యం చేసినట్లు లక్షా యాబై వేల ఉద్యోగాలకు పర్మిషన్ ఇచ్చినట్లు కేటీఆర్ ఎలా గొప్పలు చెప్పుకుంటున్నారు? అని నిలదీశాడు దాసోజు.
 
”తెలంగాణ సమాజం కేటీఆర్ చెబుతున్న దొంగ లెక్కల్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. 1,50,326 ఉద్యోగాలకు పర్మిషన్ ఇచ్చామని చెబుతున్నారు. ఒక లక్షా తొంబై వేల ఖాళీలు వున్నాయని వాళ్ళ చెంచా కమిటీనే చెబుతుంది. మరి మిగతా 40వేల ఉద్యోగాల పరిస్థితి ఏమిటో సమాధానం లేదు.

ఈ ఆరున్నర ఏళ్ళలో టీఎస్పీసీ పెట్టి అధికారులని నియామించుకొని వాళ్ళకు కోట్లు రూపాయిలు పెట్టి చివరికి ఈ గడీ దొరలు నింపిన ఉద్యోగాలు 1,32, 899 అని చెబుతున్నారు. దిని  వెనుక పెద్ద మాయ వుంది. జెన్ కో , ట్రాన్స్ కో , ఎన్ పి డీసి యల్ , ఎస్ పీడీయల్ లో కాంట్రాక్ట్ బేసిక్ లో పని చేసే 22637 ఉద్యోగులు రెగ్యులైజేషన్ చట్టం కింద రెగ్యులరైజ్ అయితే ఈ ఉద్యోగాలు కూడా తామే కల్పించామని కేటీఆర్ చెప్పుకోవడానికి సిగ్గుగా లేదా ? ప్రజలని ఎందుకు పక్క దారి పట్టిస్తున్నారు ? ఇంత మోసమా ? ఇదో వైట్ కాలర్ క్రైమ్” అని ధ్వజమెత్తారు దాసోజు.
 
‘కేసీఆర్, కేటీఆర్ లకు అసలు సిగ్గు ఉందా ? తెలంగాణ వస్తే  కాంట్రాక్ట్ అనే పదమే వుండదు. అందరినీ రెగ్యులఆర్ చేస్తామని మాయ మాటలు చెప్పి.. రెగ్యులర్ చేయకపోగా వున్న ఉద్యోగాలు తీసేసి, ఖాళీలు గాలికి వదిలేసి, చివరికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు చట్టరిత్యా రెగ్యులర్ ఐతే ఆ ఉద్యోగాలు తమ ప్రభుత్వం కల్పించిదని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదా ?

తెలంగాణ ప్రజలు అంత అమాయకుల్లా కనిపిస్తున్నారా ? కవితగారికి ఉద్యోగం లేకపోతే కల్వకుంట్ల కుటుంబం అంతా ఏకమై ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చే వరకూ నిద్రపోలేదే.. మరి తెలంగాణ బిడ్డలు ఎం చేశారు ? వాళ్ళవి జీవితాలు కాదా ? వాళ్ళ జీవితాల్లో ఆనందం వద్దా ? వాళ్లకు బ్రతుకు వద్దా ? మీ కుటుంబం కోసం తెలంగాణ పోరాటం జరిగిందా ?

మీ కుటుంబ సభ్యులు ఉద్యోగాలు పంచుకోవడానికి తెలంగాణ ఏర్పాటైయిందా ? తెలంగాణ సమాజం, పట్టభద్రులు, నిరుద్యోగులు, విద్యార్ధులు మీ అరాచరకాలని గమనిస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులంతా కలసి కసి కొద్ది కర్రుకాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా వున్నారు” అని హెచ్చరించారు దాసోజు.
 
కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. 2011-12 లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో, అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.. లక్షా పై చిలుకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి వాస్తవామా కదా ? తెలంగాణ వస్తే మన ఉద్యోగాలు మనం ఇచ్చుకుందామని ఏపీపీఎస్సిని బహిష్కరించాలని కేటీఆర్ పిలుపునివ్వడం గుర్తుందా? కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో 2004, 2006, 2008,2011 ఇలా వరుసగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది.

కానీ ఈ ఏడు సంవత్సరాల్లో ఎంగిలి మెతుకులు వేసినట్లు ఒక్క డీఎస్సీ. టీచర్స్ పోస్టలు కూడా భర్తీ చేయకుండా, వున్న స్కూల్ ని తీసేసి , విధ్యా వ్యవస్థని భ్రస్టుపట్టించారు కేసీఆర్. ఈ ఏడేళ్ళలో ఒక్క గ్రూప్ వున్న పోస్ట్ కూడా భర్తీ చేయకుండా తెలంగాణ యువత భవిష్యత్ తో చెలగాటమాడుతున్నారు. కరోనా కాలంలో అనేక మంది టీచర్స్ ఉపాధి కోల్పోయారు. కార్పోరేట్ విద్యా సంస్థలు నిర్ధక్ష్యణంగా టీచర్స్ ని తొలగిస్తే వారి గోడు వినే నాధుడే లేడు.” అని ఆవేదన వ్యక్తం చేశారు దాసోజు.
 
”కేటీఆర్ ఐటీఐఆర్ పిచ్చిపిచ్చి గురించి మాట్లాడుతున్నారు. ఐటీఐఆర్ రాహుల్ గాంధీ గారి కల. పొన్నా లక్ష్యయ్య గారు ఐటీ మంత్రిగా ఉన్నప్పుడే 50ఎకరాల భూములని గుర్తించారు.  కేవలం 13వేల కోట్ల రూపాయిలు 15ఏళ్ల కాలంలో ఖర్చుపెట్టాలి. దాని ద్వార రెండున్న లక్ష కోట్ల రూపాయిల ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. యాబై లక్షల ఉద్యోగాలు వస్తాయి.

కేంద్రంలో వున్న బిజెపి ప్రభుత్వం13వేల కోట్ల రూపాయిలు ఇవ్వలేదని కుంభకర్ణుడు నిద్రలేచినట్లు కేటీఆర్ ఇప్పుడు చేతకాని మాటలు చెబుతున్నారు. కేంద్రం ఇవ్వకపోతే మీ ఎంపీలు ఏం చేస్తున్నారు? ఏనాడైనా తెలంగాణకు ఇది కావాలని పోరాటం చేశారా మీ నాయకులు ? ఏ మొహం పెట్టి ఓట్లు అడుగుతున్నారు? అని  తీవ్ర స్థాయిలో మండిపడ్డారు దాసోజు శ్రవణ్.