శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 21 జనవరి 2021 (10:41 IST)

కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తే టీఆర్‌ఎస్‌లో అణుబాంబు కంటే భారీ పేలుడు: బండి సంజయ్‌

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ టీఆరెస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తే టీఆర్‌ఎ్‌సలో అణుబాంబు కంటే భారీ పేలుడు జరగడం ఖాయమని అన్నారు.

ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ.. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను ఎందుకు సీఎం చేయకూడదని ప్రశ్నించారు.

‘‘ఈటల ఏం తక్కువ చేశారు? కేటీఆర్‌ ఏం ఎక్కువ చేశారు? సీఎం కుమారుడే సీఎం కావాలా? దళితుడిని సీఎం చేస్తే ఏమవుతుంది? అసలు తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్‌ పాత్ర ఏంటి?’’ అని సంజయ్‌ ప్రశ్నించారు.

కేటీఆర్‌ను సీఎంను చేయడానికి కేసీఆర్‌ మూడు రోజులపాటు దోష నివారణ పూజలు చేశారని, ఆ ద్రవ్యాల (వస్తువులు)ను త్రివేణి సంగమంలో కలిపేందుకే కాళేశ్వరం వెళ్లారని అన్నారు. అంతే తప్ప.. ప్రాజెక్టు కోసం కాదని పేర్కొన్నారు.

ఫాంహౌ్‌సలో ఈ పూజలు మూడురోజులు జరిగాయని, శృంగేరి నుంచి ప్రత్యేకంగా పూజారులను రప్పించారని తెలిపారు. ఇక సీతారామ ప్రాజెక్టు, తుపాకులగూడెం ప్రాజెక్టుల పేరిట మరో రూ.50 వేల కోట్లు దండుకునేందుకు కొత్త నాటకానికి తెర తీశారని సంజయ్‌ ఆరోపించారు.

తాము అధికారంలోకి రాగానే 125 అడుగుల అంబేడ్కర్‌ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం అన్ని రాష్ట్రాల నుంచి మట్టిని సేకరిస్తామని తెలిపారు.