1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 జూన్ 2021 (07:52 IST)

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి?! సోనియా కోర్టులో బంతి

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథ సారథిగా ఆ పార్టీకి చెందిన ఎంపీ ఏ. రేవంత్ రెడ్డి ఎంపికయ్యే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈయనతో పాటు.. మధు యాష్కీ గౌడ్, జీవన్ రెడ్డిలు కూడా ఉన్నారు. దీంతో టీపీసీసీ బంతి ప్రస్తుతం పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కోర్టులో ఉంది. ఈ ముగ్గురులో ఆమె ఎవరి పేరును ఎంపిక చేస్తారోనన్న ఉత్కంఠ సర్వత్వా నెలకొంది. 
 
ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ నియామకం ప్రక్రియ సోనియా వద్దకు చేరింది. దీంతో పాటు కార్య నిర్వాహక అధ్యక్షుడు, ప్రచార కమిటీ చైర్మన్‌ పదవులకు ఐదు పేర్లను ప్రతిపాదిస్తూ సోనియాకు ఏఐసీసీ ఆఫీస్‌ నోట్‌ పెట్టినట్లు తెలిసింది. ఇందులో ఎంపీ రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కీ గౌడ్‌, దామోదర రాజనర్సింహ, షబ్బీర్‌ అలీ పేర్లను ప్రతిపాదించినట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 
 
రాజనర్సింహ, షబ్బీర్‌ అలీని ఎస్సీ, మైనార్టీ కోటాలో కార్య నిర్వాహక అధ్యక్షులుగా ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ను నియమించే అవకాశమే ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ఏఐసీసీ ఆఫీస్‌ పంపిన నోట్‌లోనూ రేవంత్‌వైపే మొగ్గు చూపినట్లు ప్రచారం జరుగుతోంది.
 
అదేసమయంలో పార్టీలో సీనియారిటీ ఆధారంగా జీవన్‌రెడ్డి, బీసీ కోటాలో మధుయాష్కీగౌడ్‌లూ ఈ పదవికి పోటీ పడుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డికే సోనియాగాంధీ ఓటు వేసిన పక్షంలో కార్యనిర్వాహక అధ్యక్షుడు, ప్రచార కమిటీ చైర్మన్‌ పదవులకు జీవన్‌రెడ్డి, మధుయాష్కీ పేర్లను ఆమోదించవచ్చని సమాచారం. 
 
అలాగే, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌ బాబుకూ టీపీసీసీలో ప్రాధాన్యం గల పోస్టు దక్కే ఆస్కారం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రేసులో చివరి వరకూ కొనసాగిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డికి ఏఐసీసీలో అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది.