1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 మార్చి 2023 (15:36 IST)

రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు - నాలుగు రోజుల పాటు వర్షాలు

rain
రెండు తెలుగు రాష్ట్రాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయింది. అదేసమయంలో మరికొన్న ప్రాంతాల్లో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇంకొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 
 
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గురువారం నుంచి ఆదివారం వరకు పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. గురు, శుక్రవారాల్లో మూడు, నాలుగు జిల్లాల్లో, శని, ఆదివారాల్లో మాత్రం రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వర్ష ప్రభావం ఉంటుందని తెలిపింది. 
 
అదేసమయంలో ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. బుధవారం నిజామాబాద్, నిర్మల్, నాగర్ కర్నూలు, ఆదిలాబాద్ జిల్లాల్లో 40 డిగ్రీల పైచిలుకు ఉష్ణోగ్రతలు ననమోదయ్యాయి. 
 
నిజామాబాద్‌లోని జక్రాన్‌పల్లిలో ఆత్యధికంగా 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే రెండు మూడు రోజుల్లో మరిన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత 40 డిగ్రీలు దాటే అవకాశం ఉందని పేర్కొంది. అందువల్ల ప్రజలు ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు పగటిపూట ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, ఇతరులు కూడా అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచన చేసింది.