శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 18 ఫిబ్రవరి 2021 (09:06 IST)

రాష్ట్రానికి కేసీఆర్ చేసిదేమీ లేదు: భట్టి విక్రమార్క

దళిత, గిరిజనులను మోసం చేస్తున్న కేసీఆర్ ను డిండి ప్రాజెక్టులో ఎత్తేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు ఆగ్రహంగా చెప్పారు. కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తే తెలంగాణలో మరో ఉద్యమం తప్పదని ప్రభుత్వాన్ని భట్టి హెచ్చరించారు. రైతులతో ముఖాముఖీ-పొలం బాట, పోరుబాటలో భాగంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బ్రుందం దేవరకొండ నియోజకవర్గం తవక్లాపూర్ గ్రామ రైతులతో ముఖాముకి నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు మాజీ ఎమ్మెల్యే బాలునాయక్, మాజీ ఎంపీ హనుమంతరావు, ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ వైస్ ఛైర్మన్ కోదండ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి, ఎస్టీ సెల్ ఛైర్మన్ జగన్ లాల్ నాయక్, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, ఎన్.ఎస్.యూ.ఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్  తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ.. రైతుల సమస్యలు తెలుసుకునేందుకే సీఎల్పీ బ్రుందం బయలుదేరిందని భట్టి విక్రమార్క తెలిపారు. రాజకీయ సమావేశాల కోసమో, ఎన్నికల కోసమో కాంగ్రెస్ శాసనసభా పక్షం రాలేదని.. కేవలం రైతాంగం కోసం, ప్రజల కోసం మాత్రమే రాష్ట్రమంతా తిరుగుతోందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

కేంద్రం, రాష్ట్రం వ్యవహరిస్తున్న రైతాంగా విధానలతో రైతులు ఆందోళనలో ఉన్నట్లు భట్టి మీడియాకు వివరించారు. రైతులు దేశానికి వెన్నుముక వంటివారిని... అటువంటి వెన్నుముకును విరగ్గొట్టి కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని భట్టి మండిపడ్డారు. రైతులను కాపాడేందుకు, వారి గొంతును వినిపించేందుకు సీఎల్పీ, కాంగ్రెస్ పార్టీ శక్తివంచన లేకుండా క్రుషి చేస్తుందని అన్నారు.

కోనుగోలు కేంద్రాలు ఎత్తేస్తే మా బతుకులు ఏమవుతాయనే భయాందోళనలో రైతులు ఉన్నారని భట్టి చెప్పారు. ఐకేపీ సెంటర్లు తీసేస్తే.. మా పంటలను ఎక్కడ అమ్ముకోవాలి? అంటూ రైతులు ఆందోళనలో ఉన్నారని భట్టి ఆగ్రహంగా చెప్పారు. 

కొనుగోలు కేంద్రాలు, ఐకేపీ సెంటర్లు లేకపోతే.. దళారులు, వ్యాపారులు కుమ్మక్కై రైతులను ముంచేస్తారని భట్టి వివవరించారు. రైతులు, పరిస్థితులు ఇంత అధ్వాన్నంగా ఉన్నా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరూ క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదని భట్టి అన్నారు. 

కనీస మద్దతు ధర లేక, కొనుగోలు కేంద్రాలు, ఐకేపీ సెంటర్లు ఎత్తేస్తే.. పోరాటం తప్ప మరో మార్గం లేదన్న భావనలో రైతాంగం ఉన్నారని భట్టి వివరించారు. రైతుల గుండెల్లో అంతులేని ఆవేదన, భయం దాగున్నాయని.. ఈ నేపథ్యంలో మరో ఉద్యమానికి రైతులు సిద్ధమవుతున్నారని భట్టి చెప్పారు. 

నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే గ్రామంలో వెయ్యి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందని, అలాగే 700 ఫెన్షన్లు కూడా మంజూరు చేసిందని అన్నారు. కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చిన ఈ ఏడేళ్లలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదని, కొత్తగా ఒక్క ఫెన్షన్ కూడా మంజూరు చేయలేదని భట్టి మీడియాకు వివరించారు.

అధికారంలోకి వస్తే దళిత, గిరిజనులకు మూడు ఎకరాల భూమి ఇస్తానన్న కేసీఆర్.. తరువాత కొత్తగా భూమి ఇవ్వకపోగా నాడు ఇందిరమ్మ ఇచ్చిన భూములను లాక్కుంటున్నారని భట్టి ఆవేశంగా చెప్పారు. కేసీఆర్ చెప్పిన హామీల్లో ఒక్కటైనా అమలు చేశాడా? అని భట్టి ప్రశ్నించారు.

ఇందిరమ్మ పంచిన భూములను, అలాగే నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు దళిత, గిరిజనులకు పంచిన భూములను లాక్కుంటుంటే.. చూస్తూ ఊరుకోమని.. ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించారు భట్టి విక్రమార్క. ఈ ప్రంతానికంతా డిండి ప్రాజెక్టును నుంచి నీళ్లు తీసుకువస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్.. 5 ఏళ్లుగా ఒక్క ఎకరాకైనా నీళ్లు పారించారా? అని భట్టి గట్టిగా అడిగారు.

డిండి పేరుమీద వేల కోట్ల రూపాయలు విడుదల చేసి కాలువలు తవ్వించారు కానీ.. అసలు డిండికి నీళ్లు ఎక్కడ నుంచి తసుకువస్తారో చెప్పలేదని భట్టి అన్నారు. చెరువు ఎక్కడుందో చెప్పకుండా కాలువలు తవ్వితే ఎలా అని భట్టి అన్నారు. డిండి ప్రాజెక్టపై ఇప్పటికైనా ఈ ప్రాంత వాసులకు నిజాలు చెప్పాలని భట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

కాంగ్రెస్ పార్టీనే ఫీజు రీ ఎంబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ , ఫెన్షన్లు, వంద రోజులు పనిని, ఇందిరమ్మ ఇండ్లను కూడా ఇచ్చిందని చెప్పారు. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని ప్రజలు కేసీఆర్ చేతిలో పెడితే.. అధికారంలోకి వచ్చన దగ్గర నుంచీ దోచుకుంటున్నారని భట్టి ఆగ్రహంగా చెప్పారు.

ఈ ఏడేళ్లలో కేసీఆర్ రాష్ట్రానికి చేసింది శూన్యం తప్ప ఏమీలేదని భట్టి చెప్పారు. ఈ విషయాలపై లెక్కలతో సహా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని భట్టి ప్రజలకు చెప్పారు. కేసీఆర్ పాలనతో ఏడేళ్లుగా పేదలు, దళిత, గిరిజనులు మోసానికి గురవుతున్నారు.

పేదలకు రావాల్సిన ఇండ్లు రావడం లేదు.. ఉద్యోగాలు రావాడం లేదు.. పెన్షన్లు రావడం లేదని అన్నారు. కొనుగోలు కేంద్రాలను ఎత్తేస్తానన్న ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ ను డిండి ప్రాజెక్టులోనో, లేక బంగాళా ఖాతంలోకో ఎత్తేయాలని భట్టి ఆగ్రహంగా చెప్పారు.