బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 4 జనవరి 2020 (16:56 IST)

మంత్రులకు కేసీఆర్ వార్నింగ్

టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మంత్రులకు సీఎం కేసీఆర్‌ స్ట్రాంగ్ వార్నింగ్‌ ఇచ్చారు. ఒక్క మునిసిపాలిటీ, కార్పొరేషన్‌లో ఓడినా మంత్రి పదవులు ఊడతాయని గులాబీ బాస్ హెచ్చరించారు. టికెట్ల పంపిణీ, రెబల్స్‌కు బుజ్జగింపుల బాధ్యత ఎమ్మెల్యేలదేనని కేసీఆర్ స్పష్టం చేశారు.

శనివారం నాడు సుమారు రెండున్నర గంటలపాటు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలపై నిశితంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యనేతలకు కేసీఆర్ సలహాలు, సూచనలు ఇచ్చారు.
 
మనకు ఎవరితోనూ పోటీ లేదు..!
‘120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లు మనమే గెలుస్తున్నాం. సర్వేలు అన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయి. బీజేపీ పోటీ అనే అపోహలు వద్దు..మనకు ఎవరితోనూ పోటీ లేదు. నియోజకవర్గాల్లో క్యాడర్‌తో ఎమ్మెల్యేలు ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలి.

పాత కొత్త నాయకులు సమన్వయంతో ఉండాలి. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతిఒక్కరూ పనిచేయాలి. అవసరం ఉన్న చోట మంత్రులు ప్రచారం చేస్తారు’ అని సమావేశంలో కేసీఆర్ సూచించారు.
 
గొడవపై కేసీఆర్ ఆరా..
ఇదిలా ఉంటే.. సమావేశంలో భాగంగా మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మధ్య జరిగిన గొడవపై కేసీఆర్‌ ఆరా తీసినట్లు తెలుస్తోంది. సమావేశంలోనే సుధీర్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారని సమాచారం. నిన్న మేడ్చల్‌ ఎన్నికల ప్రచారంలో జరిగిన ఘటనపై సుధీర్‌రెడ్డి వివరణ ఇచ్చారని తెలుస్తోంది.
 
అజయ్‌ కుమార్‌కు అవమానం
తెలంగాణ భవన్‌లో మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌కు అవమానం జరిగింది. తెలంగాణ భవన్‌లోకి వస్తుండగా పువ్వాడను పోలీసులు తనిఖీ చేశారు. పోలీసుల చర్యతో పువ్వాడ తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.

కాగా.. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లాపరిషత్, కార్పొరేషన్ చైర్మన్‌లు హాజరయ్యారు. ఈ మీటింగ్‌కు వెళ్తుండగా మంత్రి పువ్వాడను పోలీసులు తనిఖీ చేశారు.