శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 ఆగస్టు 2022 (18:39 IST)

హోం మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరబోతున్నా : కోమటిరెడ్డి రాజగోపాల్

komatireddy rajagopal reddy
తాను కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నట్టు తెలంగాణ రాష్ట్రానికి చెందిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. బీజేపీ నేత వివేక్‌తో కలిసి ఆయన శుక్రవారం అమిత్ షాను కలిశారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ, ఈ నెల 8వ తేదీన స్పీకర్ ఫార్మెట్‌లో తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత బీజేపీలో చేరుతానని చెప్పారు. 
 
భవిష్యత్‌లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సైతం సరైన నిర్ణయం తీసుకుంటారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆత్మగౌరవం ఉన్నవారు కాంగ్రెస్‌ పార్టీలో ఉండరన్న ఆయన.. తప్పుడు వ్యక్తి చేతుల్లోకి పీసీసీ పదవి వెళ్లిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
తనపై చేసిన ఆరోపణలను రేవంత్‌రెడ్డి రుజువు చేయలేక పోయారని, ఇప్పటికైనా రుజువు చేయాలని సవాల్‌ విసిరారు. మునుగోడు ఉప ఎన్నిక రాజగోపాల్‌రెడ్డి కోసం కాదని, తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పు తీసుకొస్తుందని ఆయన జోస్యం చెప్పారు.