1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 డిశెంబరు 2020 (11:23 IST)

ఫేస్‌బుక్ ప్రేమ.. గుండెలపై పచ్చబొట్టు :: నువ్వు నాకొద్దంటూ ఛీ కొట్టిన ప్రియురాలు

ఫేస్‌బుక్ ప్రేమ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ముఖ పుస్తకంలో పరిచయమైన ఆ అమ్మాయి చెప్పిన మాటలు నమ్మి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. తమ ప్రేమకు గుర్తుగా గుండెలపై పచ్చబొట్టు కూడా వేయించుకున్నాడు. కానీ, అతనితో అవసరం తీరిన తర్వాత... నువ్వు నాకొద్దు అంటూ ఆ యువతి ఛీకొట్టింది. అంతే.. ఆ మాటలను విన్న ప్రియుడు తీవ్ర మనోవేదనకుగురై... రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
ఈ విషాదకర ఘటన సికింద్రాబాద్ ఆల్వాల్ సమీపంలోని భూదేవి నగర్ పరిధిలో ఉన్న రైల్వే ట్రాక్‌పై జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, సికింద్రాబాద్‌కు చెందిన వంశీకృష్ణ (22) అనే యువకుడుకి అల్వాల్ ప్రాంతానికి చెందిన 20 యేళ్ల యువతి ముఖపుస్తకం ద్వారా పరిచయమైంది. ఈమె ఓ బ్యాంకులో పని చేస్తూవస్తోంది. ఫేస్‌బుక్‌లోనే వారిద్దరూ మాట్లాడుకోవడం, చాటింగ్ చేసుకోవడం చేయసాగారు. అలా ఒకరికి ఒకరు దగ్గరయ్యారు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. తన ప్రేమను ఆమెకు తెలిపేందుకు ఆమె చిత్రాన్ని తన గుండెలపై టాటూగా కూడా వేయించుకున్నాడు. 
 
ఇంతలో ఏమైందోగానీ, ఇద్దరి మధ్యా విభేదాలు వచ్చాయి. నువ్వు నాకొద్దంటూ ఆమె దూరమైంది. దీంతో అతను తీవ్ర మనస్తాపానికి గురై, రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. విధులకు వెళ్తున్నట్టు ఇంట్లో చెప్పిన వంశీకృష్ణ నేరుగా వెళ్లి ఆత్మహత్య చేసుకుని విగత జీవిగా కనిపించాడు.
 
అంతకుముందు ఆదివారం తన స్నేహితుల వద్దకు వెళ్లి, కాసేపు గడిపాడని పోలీసులు తమ విచారణలో పేర్కొన్నారు. ప్రియురాలితో వచ్చిన విభేదాలే అతని ఆత్మహత్యకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు, మరిన్ని వివరాల కోసం లోతుగా విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి, ప్రియురాలి వద్ద వివరాలు సేకరిస్తున్నారు.