1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: సోమవారం, 29 అక్టోబరు 2018 (13:42 IST)

దొంగతనం కేసులో హిట్ చిత్రాల పాటల రచయిత కులశేఖర్ అరెస్ట్

పాటల రచయితగా అతి తక్కువ చిత్రాలతోనే ఎక్కువ పేరు సంపాదించుకున్నారు కులశేఖర్. చిత్రం, నువ్వు-నేను, జయం వంటి సూపర్ హిట్ సినిమాలకు పాటలు రాసిన ప్రముఖ సినీగేయ రచయిత కులశేఖర్ జర్నలిస్టుగా తన కెరియర్ ప్రారంభించారు. అయితే తాజాగా ఓ చోరీ కేసులో కులశేఖర్‌ను జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. 
 
ప్రస్తుతం కులశేఖర్‌ హైదరాబాద్‌ మోతీనగర్‌లో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. మూడు రోజుల క్రితం ఆర్బీఐ క్వార్టర్స్‌ సమీపంలో ఓ పూజారి చేతి సంచి చోరీ చేశాడు. శ్రీనగర్‌ కాలనీలోని ఓ ఆలయం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఆదివారం ఆయన్ను అరెస్టు చేసినట్లు బంజారాహిల్స్‌ పోలీసులు తెలిపారు. కులశేఖర్ నుంచి రూ.50 వేల విలువైన 10 సెల్‌ఫోన్‌లు, రూ.45 వేల విలువైన చేతిసంచులు, కొన్ని క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు, తాళంచెవులు స్వాధీనం చేసుకున్నామన్నారు. 
 
అనంతరం ఆయన్ను రిమాండుకు తరలించినట్లు తెలియజేశారు పోలీసులు. 2016లో కాకినాడలోని ఆంజనేయస్వామి దేవాలయంలో శఠగోపం చోరీ చేశాడు. ఆ కేసుకు సంబంధించి రాజమండ్రి జైలులో ఆరు నెలల పాటు జైలుశిక్షను అనుభవించాడు. ఓ సినిమాలో కులశేఖర్‌ రాసిన పాట పూజారులను కించపరిచేలా ఉందని ఆ సామాజికవర్గం అతన్ని దూరం పెట్టింది. 
 
దాంతో బ్రాహ్మణుల మీద కులశేఖర్‌ ద్వేషాన్ని పెంచుకుని పూజారులను, ఆలయాలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నట్టు సమాచారం. ఆర్థిక పరిస్థితి, మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో చిత్ర పరిశ్రమకు దూరమైయాడు కులశేఖర్. చెడు వ్యసనాలకు బానిసవడంతో కుటుంబ సభ్యులకు కూడా దూరమయినట్టు సమాచారం.