గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : గురువారం, 13 డిశెంబరు 2018 (13:49 IST)

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ను గెలిపిస్తాం : అసదుద్దీన్ ఓవైసీ

తెలంగాణ రాష్ట్రంలో తెరాస అధినేత కేసీఆర్‌కు మద్దతిచ్చినట్టుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి మద్దతిచ్చి గెలిస్తామని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రచారం చేయడాన్ని కేసీఆర్‌తో పాటు అసదుద్దీన్ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. 
 
ఈనేపథ్యంలో తెరాస అధినేత కేసీఆర్‌తో సమావేశమైన తర్వాత అసదుద్దీన్ ఓవైసీ మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబుకు తన సొంత రాష్ట్రంలోనే తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. అందువల్ల వచ్చే ఎన్నికల్లో కనీసం రెండు ఎంపీ స్థానాలు కూడా గెలవలేరని జోస్యం చెప్పారు. 
 
ఏపీలో తాను ప్రచారం చేస్తే ఎలా వుంటుందో? ఆ ప్రభావం ఎలా ఉంటుందో చంద్రబాబుకు రుచి చూపిస్తాననీ, ఆంధ్రాకు వెళ్లి వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తామంటూ సంచలన ప్రకటన చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రచారం చేసినా తెలంగాణలో చంద్రబాబు ఫలితాలు సాధించలేకపోయారంటూ ఆయన ఎద్దేవా చేశారు.