శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం

కొట్టుకుపోయిన గేటు స్థానంలో కొత్త గేటు అమరిక

సూర్యపేట జిల్లాలో మూసి ప్రాజెక్టుకు అత్యవసరంగా అమర్చాల్సిన గేటు ప్రాజెక్టు వద్దకు చేరుకుంది. ఈ రోజు నుంచే పనులు ప్రారంభిస్తారని రాష్ట్ర విద్యుత్తు శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తెలిపారు.

మూసీ ఆయకట్టు రైతాంగం ఆందోళన చెందవద్దని మంత్రి రైతులకు విజ్ఞప్తి చేశారు. సూర్యాపేట జిల్లాలో ఉన్న మూసీ ప్రాజెక్టు 5వ నంబరు గేటు రెండు రోజుల కిందట కొట్టుకుపోయిన విషయం అందిరికీ తెలిసిందే. దాని స్థానంలో కొత్త గేట్​ను అమర్చేందుకు అధికార యంత్రాంగం పనులు ప్రారంభించారు.

గత మూడు రోజులుగా వృథాగా పోతున్న నీటితో ప్రాజెక్టు నీరు సగానికి తగ్గింది. వచ్చే వరద నీటిని కాపాడేందుకు ప్రభుత్వం కొత్త గేటు అమర్చే పనులను శరవేగంగా పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ మేరకు మంత్రి జగదీష్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్ ప్రాజెక్టును సందర్శించారు.

అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి గేటు గిడ్డర్ నిర్మాణానికి ఆదేశించారు. ఇప్పటికే హైద్రాబాద్​లో గిడ్డర్ నిర్మాణం జరుగుతుండగా... ప్రాజెక్టు గేటు చిత్తూరు జిల్లా కళ్యాణి డ్యామ్ వద్ద నుంచి తీసుకువచ్చారు. నిన్న బయలు దేరిన గేటు ఇవాళ ఉదయం ప్రాజెక్టు వద్దకు చేరుకుంది.

ప్రాజెక్టు వద్దకు చేరుకున్న మంత్రి జగదీష్ రెడ్డి కొత్తగేటును గేటును పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన పనులు గేటును అమరుస్తున్నట్లు వెల్లడించారు. రైతులు ఆందోళనకు గురికావద్దని మంత్రి జగదీష్ రెడ్డి కోరారు.