శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 14 జనవరి 2021 (11:54 IST)

బర్డ్‌ఫ్లూ దెబ్బకు రాలిపోతున్న కోళ్లు - నిజామాబాద్‌లో 1500 కోళ్లు మృతి

దేశంలో బర్డ్‌ఫ్లూ దెబ్బకు కోళ్లు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ‌ పలు రాష్ట్రాల్లో శరవేగంగా వ్యాపిస్తోంది. ఈ నేప‌థ్యంలో యూపీ‌, కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, హర్యానా, గుజరాత్, మ‌హారాష్ట్ర‌ల్లో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగులోకి వ‌చ్చాయి. ప‌లు రాష్ట్రాల్లో ఉన్న‌ట్టుండి పెద్ద ఎత్తున కాకులు, కోళ్లు మృతి చెందుతుండడం క‌ల‌కలం రేపుతోంది.
 
ఇప్పుడు తెలంగాణ‌లోని నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం యానంపల్లి తండా శివారులోని ఓ పౌల్ట్రీ ఫామ్‌లోనూ పెద్ద ఎత్తున కోళ్లు మృతి చెంద‌డం గ‌మ‌నార్హం. 24 గంటల్లో దాదాపు 1,500 కోళ్లు మృతి చెందాయి. ఓ పౌల్ట్రీ ఫామ్ య‌జ‌మాని రెండు షెడ్లలో 8,000 కోళ్లను పెంచుతుండ‌గా వాటిని 1,500 కోళ్లు ఒక్క‌సారిగా చ‌నిపోయాయ‌ని చెప్పాడు. 
 
దీంతో చ‌నిపోయిన‌ కోళ్లను అటవీ ప్రాంతంలో గుంత తవ్వి పూడ్చిపెట్టారు. దీంతో ఆ పౌల్ట్రీ ఫామ్‌కు చేరుకున్న అధికారులు  పౌల్ట్రీ ఫామ్‌ను సందర్శించి ప‌లు వివ‌రాలు సేక‌రించారు. ఆ పౌల్ట్రీ ఫామ్‌లోని కోళ్ల రక్త నమూనాలను, మృతి చెందిన ఓ కోడిని హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పరీక్షల నిమిత్తం త‌ర‌లించారు. అయితే, మృతి చెందిన కోళ్లలో బర్డ్‌ఫ్లూ లక్షణాలు లేవని అధికారులు అంటున్నారు. 
 
ఇదిలావుండగా, టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ తన వ్యవసాయ క్షేత్రంలో కడక్‌నాథ్ కోళ్లను పెంచాలన్న నిర్ణయం వాయిదా పడింది. మధ్యప్రదేశ్‌, జబువా జిల్లా రుడిపాండాలోని కడక్‌నాథ్ కోళ్ల ఫాం నుంచి పిల్లలను తీసుకెళ్లి పెంచాలని ధోనీ నిర్ణయించాడు. అయితే, అక్కడి ఫాంలోని కోళ్లకు బర్డ్ ఫ్లూ సంక్రమించినట్టు పశుసంవర్థకశాఖ అధికారులు నిర్ధారించారు. ఇక్కడి 550 కోళ్లు, 2,800 పిల్లలు హెచ్5ఎన్1 వైరస్ బారినపడినట్టు గుర్తించారు. 
 
దీంతో కోడి పిల్లల కోసం ధోనీ ఇచ్చిన ఆర్డర్‌ను అధికారులు రద్దు చేశారు. గత నెలలో ధోనీ 2 వేల కోడి పిల్లల కోసం ఆర్డర్ ఇచ్చాడని, బర్డ్ ఫ్లూ కారణంగా ఇప్పుడా ఆర్డర్ రద్దయినట్టు పౌల్ట్రీ ఫాం యజమాని వినోద్ మేడా తెలిపారు. మరోవైపు, ఇక్కడి కోళ్ల నమూనాలను భోపాల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్‌లో పరీక్షించారు.