గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 ఫిబ్రవరి 2021 (13:02 IST)

ఇంట్లో నుంచి వెళ్లేందుకు - ఆ డ్రైవర్ పొగరుగా మాట్లాడాడనీ.. విద్యార్థిని కాదు కి'లేడి'

తెలంగాణా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్‌, సామూహిక అత్యాచారం కేసును రాచకొండ పోలీసులు ఛేదించారు. ఆమెను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదని, అత్యాచారం జరగలేదని నిర్ధారించారు. పైగా, ఇంట్లోంచి పారిపోయే ఉద్దేశంతోనే ఆ యువతి ఆటో డ్రైవర్లపై నిందలు వేసి, పోలీసులను సైతం తప్పుదోవ పట్టించినట్టు తేల్చారు. ఈ విషయాన్ని రాచకొండ పోలీసు కమిషనర్‌ ఎం.మహేశ్‌ భగవత్‌ వివరాలు వెల్లడించారు. 
 
ఈ కేసులో అన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు.. ఆ యువతిని నిలదీయగా తన నాటకానికి ముగింపు పలికింది. తనకు ఇంట్లో తల్లిదండ్రులతో ఉండంటం ఇష్టం లేదని, ఎక్కడైనా ఒంటరిగా గడపాలని ఉందని చెప్పింది. తనపై అత్యాచారం జరిగిందని తెలిస్తే.. తల్లిదండ్రులే వదిలించుకుంటారని అలా చేసినట్లు అంగీకరించిందని తెలిపారు.
 
అందులో భాగంగానే నాటకం ఆడినట్లు చెప్పిందని తెలిపారు. ఆటోడ్రైవర్‌పై నిందలు వేయడానికి కారణం అడగ్గా.. లాక్డౌన్‌ సమయంలో ఆ ఆటోడ్రైవర్‌ ఎక్కువ చార్జీ వసూలు చేస్తూ.. పొగరుగా మాట్లాడినట్లు తెలిపింది. ఇరికించాలనే అతని ఫొటోను ఇచ్చినట్లు చెప్పింది. ఇంత జరిగినా ఆమెలో పశ్చాత్తాపం లేదని సీపీ వివరించారు.
 
కాగా, ఘట్‌కేసర్ కిడ్నాప్ కేసు వ్యవహారంలో యువతి చెప్పిన వివరాలను బట్టి అదుపులోకి తీసుకోవడంపై సీపీ మహేశ్‌ భగవత్‌ ఆటోడ్రైవర్లను క్షమాపణ కోరారు. యన్నంపేటకు చెందిన రాజు, భాస్కర్‌, నాథం, శివ, రమేశ్‌ను అదుపులోకి తీసుకుని, విచారించామని చెప్పారు. 
 
ఈ కేసులో వారి ప్రమేయం లేదని, విచారణ కారణంగా వారు ఉపాధి కోల్పోయారన్నారు. వారి కుటుంబ సభ్యులు ఇబ్బంది పడకుండా.. రూ.1000, బియ్యం అందజేశామన్నారు. విచారణలో కీసర, ఘట్‌కేసర్‌ పరిధిలోని అన్ని ఆటో యూనియన్లు సహకరించాయన్నారు. మీడియా కథనాలతో ఆటో యూనియన్లు ఆందోళన చెందాయని, ఒక దశలో మీడియాకు వ్యతిరేకంగా పీఎస్‌ వద్ద ధర్నాకు సిద్ధమయ్యాయని తెలిపారు.