1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 మే 2022 (13:15 IST)

తెలంగాణలో పొలిటికల్ హీట్: జనం గోస-బీజేపీ భరోసా"

telangana
తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ రోజు ప‌ర్య‌టించ‌నున్నారు. రేపు, ఎల్లుండి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. వీరి పర్యటనల్లో భాగంగా బహిరంగ సభతో పాటు పలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. 
 
దీనికోసం ఇప్పటికే ఆయా పార్టీల లీడ‌ర్లు ఏర్పాట్లు పూర్తి చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చేపట్టారు. 
 
ఏప్రిల్ 14న గద్వాల జిల్లాలో ప్రారంభమైన ఈ యాత్ర వనపర్తి, నారాయణపేట జిల్లాల మీదుగా మహబూబ్ నగర్ జిల్లాలో కొనసాగుతోంది.
 
ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో "జనం గోస-బీజేపీ భరోసా" పేరుతో భారీ బహిరంగ సభ జ‌ర‌గ‌నుంది. ఈ సభలో పాల్గొనేందుకు నడ్డా ఈ రోజు వ‌స్తున్నారు.
 
ఇక‌.. తెలంగాణ పర్యటనలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాకు చేరుకుంటారు. సాయంత్రం బీజేపీ కార్యాలయంలో బేరర్స్‌తో జేపీ నడ్డా సమావేశం కానున్నారు. ఆ త‌ర్వాత జనం గోస-బీజేపీ భరోసా సభలో ప్రసంగిస్తారు. రేపు (శుక్రవారం) కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రానున్నారు. 
 
వరంగల్‌లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొనడంతో పాటు పలు పార్టీ కార్యక్రమాల్లో రాహుల్ పాల్గొంటారు. ఎన్నికలకు మరో ఏడాదిన్నర పాటు సమయం ఉన్నప్పటికీ తెలంగాణలో రాజకీయ వేడి అప్పుడే పీక్స్‌కి చేరుతోంది. 
 
ఎన్నికల వాతావరణాన్ని తలపించేలా జాతీయ, ప్రాంతీయ పార్టీలు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ కృషి చేస్తుండగా, మరోసారి అధికారాన్ని నిలబెట్టుకొనేలా టీఆర్‌ఎస్‌ పావులు కదుపుతోంది. 
 
మొత్తానికి ఈ మూడు పార్టీల మధ్య జరుగుతున్న పొలిటికల్ వార్‌తో తెలంగాణలో ఎన్నికల వాతావరణం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.