1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 జనవరి 2021 (21:29 IST)

అవినీతి సొమ్ముతో అయోధ్యలో మసీదు కడుతున్నారు? అసదుద్దీన్

కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా తలపెట్టారు. ఇందుకోసం భారీ ఎత్తున విరాళాలు సేకరిస్తున్నారు. మరోవైపు, అయోధ్యలో మసీదు నిర్మాణానికి ముస్లిం మతపెద్దలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మసీదు నిర్మాణంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవినీతి సొమ్ముతో అయోధ్యలో మసీదును నిర్మిస్తున్నారన్నారు. 
 
సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రారంభమైంది. దీనికోసం దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున విరాళాల సేకరణ జరుగుతోంది. మరోవైపు, అయోధ్యలోనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేటాయించిన స్థలంలో మసీదు నిర్మాణం కూడా జరుగనుంది.
 
ఈ క్రమంలో అయోధ్యలో మసీదు నిర్మాణంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్య మసీదు ఇస్లాం సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉందన్నారు. బాబ్రీ మసీదును కూల్చిన చోట మసీదును నిర్మించడం అనైతికమన్నారు. 
 
అలాంటి చోట ప్రార్థనలు చేయడం కూడా తప్పేనని మత పెద్దలు చెపుతున్నారని అన్నారు. ముస్లిం పెద్దల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని తెలిపారు.
 
ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉలేమా కూడా దాన్ని మసీదు అని పిలవకూడదని, అక్కడ ప్రార్థనలు చేయకూడదని చెప్పారని ఒవైపీ తెలిపారు. మసీదు నిర్మాణానికి చందాలు ఇవ్వడం తప్పని చెప్పారు. 
 
ఎన్నికలలో దళితులతో ముస్లింలు ఎవరూ పోటీ పడకూడదని సూచించారు. తాను అంబేద్కర్ అభిమానినని, దళితులకు అన్ని విధాలా సహకరిస్తానని చెప్పారు. దేశంలో శాంతిని కోరుకునే వారిని జైలుకు పంపిస్తున్నారని అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు.