1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 నవంబరు 2021 (22:57 IST)

తల్లి శవం ముందు ఐదేళ్ల చిన్నారి... కేటీఆర్‌కు ట్యాగ్.. రంగంలోకి కలెక్టర్

Child
తల్లి శవం ముందు ఐదేళ్ల చిన్నారి కూర్చున్న ఫోటో నెట్టింట వైరల్ అయ్యింది. తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన చిన్నారికి ఓ నెటిజన్ చేసిన ట్వీట్ మరో జీవితాన్ని అందించింది. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లాలోని ముథోల్ మండలం ఎడ్‌బిడ్ గ్రామంలో హృదయ విదారకర ఘటన చోటుచేసుకుంది. 
 
గ్రామానికి చెందిన ఓ ఐదేళ్ల చిన్నారి తల్లి మంగళవారం అనారోగ్యంతో చనిపోయింది. అప్పటికే తండ్రి కూడా మృతి చెందడంతో దిక్కుతోచని స్థితిలో తల్లి శవం ముందు దీనంగా కూర్చున్న చిన్నారి ఫొటోను ఓ వ్యక్తి తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఆ ఫొటోను గంటెపాక శ్రీకాంత్ అనే నెటిజన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసి ''ప్రభుత్వం ఈ ఐదేళ్ల చిన్నారి బాధ్యతలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని'' మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేశాడు.
 
ఆ ట్వీట్‌పై స్పందించిన మంత్రి కేటీఆర్.. నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీకి ట్యాగ్ చేసి చిన్నారి బాగోగులు చూడాలని ట్వీట్ చేశారు. దీంతో కలెక్టర్ సహా, జిల్లా యంత్రాంగం ఎడ్‌బిడ్ గ్రామానికి వెళ్లి చిన్నారిని కలిసి పరామర్శించారు. 
Child
 
వెంటనే శిశు సంక్షేమ శాఖ అధికారులు చిన్నారిని దత్తత తీసుకున్నట్లు కలెక్టర్ ముషారఫ్ అలీ ప్రకటించారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన చిన్నారి విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చిన గంటెపాక శ్రీకాంత్‌ను ఆ జిల్లా ప్రజలు, నెటిజన్లు అభినందిస్తున్నారు.