1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 మే 2021 (19:21 IST)

సీఎం కేసీఆర్ కుటుంబీకులు భూకబ్జా దారులు.. రేవంత్ రెడ్డి ఫైర్

తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ కుటుంబీకులు భూకబ్జాలకు పాల్పడ్డారని దీనిపై సంపూర్ణ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తన నియోజకవర్గమైన శామీర్ పేట మండలంలోని, దేవరయాంజల్ భూముల ఆక్రమణలపై సోమవారం ప్రెస్ మీట్‌లో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. నమస్తే తెలంగాణ పేపర్ ఎండీకి కూడా ఇక్కడ భూములు ఉన్నాయన్నారు. 
 
రామాలయం భూముల్లో కేసీఆర్, కేటీఆర్‌కు భూములున్నాయని తెలిపారు. దేవరయాంజాల్ భూముల్లో సేల్ డీడ్ కేటీఆర్ పేరు మీద ఉందని.. దేవుడి మాన్యాల్లో టీఆర్ఎస్ లీడర్లకు భూములు ఉన్నాయన్నారు. సర్వే నెంబర్ 658 మంత్రి మల్లారెడ్డి ఆక్రమించుకున్నారని.. 7 ఎకరాల్లో మంత్రి మల్లారెడ్డి ఫాంహోజ్ కట్టుకున్నారని చెప్పారు. రామాలయం గుడి మాన్యం కింద ఉన్న 1553 ఎకరాల్లో కేటీఆర్, దామోదర్ రావుకు భూమి ఉందన్నారు. 
 
సర్వే నెంబర్ 437లో ఉన్న అక్రమ నిర్మాణాల్లో కేసీఆర్‌కు వాటా ఉందని.. కేటీఆర్‌కు భూమి అమ్మిందెవరని ప్రశ్నించారు. ఈ అక్రమాలను గోల్ మాల్ చేయడానికే ధరణి వెబ్ సైట్ సృష్టించారన్నారు. ధరణిలో ఎవరి భూమి ఎవరికి అమ్మారనే వివరాలే ఉండవన్నారు. 
 
1925 నుంచి 2021 వరకు దేవరయంజల్ భూముల్లోని ప్రతి సర్వే నెంబర్ లావాదేవీలపై క్లారిటీ కావాలన్నారు. మీ నిజాయితీని ప్రజల ముందు పెట్టాలంటే దమ్ముంటే కేసీఆర్ గారూ మీరు దేవరయంజల్ భూముల వివరాలు వెల్లడించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.