బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 మే 2021 (10:50 IST)

సాగర్‌లో కారు దూకుడు... 6592 ఓట్ల ఆధిక్యంలో తెరాస ఆధిక్యం

తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక ఫ‌లితాల్లో అధికార తెరాస పార్టీ భారీ మెజార్టీ దిశ‌గా దూసుకెళ్తుంది. కారు దూకుడుకు విప‌క్షాలు బెంబేలెత్తుతున్నాయి. రౌండ్ రౌండ్‌లోనూ గులాబీ గుభాళిస్తోంది. ప్ర‌తి రౌండ్‌లోనూ టీఆర్ఎస్ భారీగా మెజార్టీగా దిశ‌గా దూసుకెళ్తుండ‌టంతో పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నారు. 
 
టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ భారీ మెజార్టీ దిశ‌గా దూసుకుపోతున్నారు.. వ‌రుస‌గా తొలి ఏడు రౌండ్ల‌లోనూ టీఆర్ఎస్ అభ్య‌ర్థి మంచి ఆధిక్యాన్ని క‌న‌బ‌రిచారు. ఏడో రౌండ్ ముగిసే స‌రికి 6,592 ఓట్ల‌ మెజార్టీతో నోముల భ‌గ‌త్‌ ముందంజ‌లో ఉన్నారు. పోస్ట‌ల్ బ్యాలెట్‌లోనూ టీఆర్ఎస్ పార్టీకి అత్య‌ధిక ఓట్లు వ‌చ్చాయి. 
 
తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్‌కు 4,228 ఓట్లు, కాంగ్రెస్ అభ్య‌ర్థి జానారెడ్డికి 2,753 ఓట్లు పోల‌య్యాయి. రెండో రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 3,854, కాంగ్రెస్‌కు 3113 ఓట్లు వ‌చ్చాయి. మూడో రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 3421, కాంగ్రెస్ పార్టీకి 2,882 ఓట్లు పోల‌య్యాయి. నాలుగో రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 4,186 ఓట్లు, కాంగ్రెస్ కు 3,202 ఓట్లు వ‌చ్చాయి. 
 
ఐదో రౌండ్‌టో టీఆర్ఎస్‌కు 3,442, కాంగ్రెస్ కు 2676, బీజేపీకి 74 ఓట్లు పోల‌య్యాయి. ఆరో రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 3,989, కాంగ్రెస్ పార్టీకి 3,049 ఓట్లు వ‌చ్చాయి. ఏడో రౌండ్లో టీఆర్ఎస్ పార్టీకి 4,022, కాంగ్రెస్ పార్టీకి 2,607 ఓట్లు పోలైన‌ట్లు ఎన్నికల అధికారులు ప్ర‌క‌టించారు.
 
నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ప్రాంగణంలో కౌంటింగ్‌ నిర్వహిస్తున్నారు. రెండు హాళ్లల్లో ఏడు టేబుళ్ల చొప్పున మొత్తం 14 టేబు‌ళ్లపై లెక్కింపు ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. మొత్తం 346 పోలింగ్‌ కేంద్రాలు ఉండ‌డంతో 25 రౌండ్లలో లెక్కింపు పూర్తి‌కా‌నుంది. సాయంత్రం ఏడు గంటల వరకు అధి‌కా‌రి‌కంగా విజే‌తను ప్రక‌టించే అవ‌కాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.