గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 2 నవంబరు 2019 (18:45 IST)

కేంద్రం చేతిలో ఆర్టీసీ సమ్మె!

ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె 29వ రోజుకి చేరింది.. అటు ప్రభుత్వం గానీ, ఇటు కార్మిక సంఘాలు గానీ మెట్టు దిగడం లేదు.. ఇక హైకోర్టులోనూ వాయిదాల పర్వం కొనసాగుతున్నది.

ఈ నేపథ్యంలో సమ్మె పరిష్కారం కోసం ఆర్టీసీ జాక్ నేతలు కేంద్రంలోని బిజెపి పెద్దలను, మంత్రులను కలువ నున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను కలిసేందుకు రేపే ఆర్టీసీ జాక్ నేతలు అశ్వథామరెడ్డి, జార్జి రెడ్డిలు ఢిల్లీ వెళ్లనున్నారు… ఈ విషయాన్ని స్వయంగా జాక్ కన్వీనర్ అశ్వథామ రెడ్డి వెల్లడించారు.

సమ్మె బంతి కేంద్రం చేతిలోకి వెళ్లేందుకు టిఆర్ ఎస్ ప్రభుత్వమే దారి చూపిందని అంటున్నారు… ఆర్టీసీలో కేంద్రానికి 31 శాతం వాటా ఉందని, ఇప్పటికే ఎపి, తెలంగాణ మధ్య ఆర్టీసీ విభజన జరగలేదని కోసిఆర్ ప్రభుత్వ స్వయంగా హైకోర్టులో నివేదిక సమర్పించడంతో కథ కొత్త మలుపు తిరిగింది.

తెలంగాణాలో బిజెపి బలపడేందుకు ప్రయత్నాలు చేస్తున్న కమలనాధులకు ఆర్టీసీ సమ్మె  ఆయుధంగా కనపడింది.. అందుకే సమ్మెకు మద్దతుగా బిజెపి ఎంపిలతో పాటు తెలంగాణ బిజెపి నాయకత్వం అంతా దిగిపోయింది.. ముఖ్యంగా కరీంనగర్ ఎంపి బండి సంజయ్ సమ్మెలో సంపూర్ణ మద్దత్తుతో పాటు చాలా క్రీయాశీలకంగా ఉంటున్నారు.

నిన్న డ్రైవర్ బాబు అంత్యక్రియలు సందర్భంగా సంజయ్ పై పోలీసులు చేసిన దౌర్జన్యం కేంద్రానికి చేరింది.. ఈ ఘటన జరిగిన వెంటనే కేంద్రం పార్టీ ఇక్కడ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ ను ఢిల్లీ కి పిలిపించింది.. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నారు.

29 రోజులు గా చేస్తున్న కార్మికుల సమ్మె గురించి, దీనిపై కెసిఆర్ అనుసరిస్తున్న వైఖరీ గురించి పార్టీ పెద్దలకు లక్ష్మణ్ సవివరంగా వివరించినట్లు టాక్.. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ జాక్ నేతలు సైతం హస్తినకు పయనమవుతున్నారు.  కాగా నేటి ఉదయం ఆర్టీసీ జాక్ నేతలు ప్రతిపక్ష నేతలతో సమావేశమయ్యారు..అనంతరం జాక్ కన్వీనర్ అశ్వథామరెడ్డి మాట్లాడుతూ, తమ సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై కేంద్ర ప్రభుత్వానికి వివరిస్తామనితెలిపారు.

సమ్మెను విరమించే ప్రశ్నేలేదని మరింత ఉద్ధృతం చేస్తామని ప్రకటించారు. ఆర్టీసీ విభజనపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది చెల్లుబాటుకాదని, కార్మికులు ఆందోళనకు గురికావద్దని పేర్కొన్నారు. రూట్లను వేరుచేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పారు.

సమస్యలు పరిష్కరించేవరకు సమ్మె కొనసాగిస్తామన్నారు. ఈ సమావేశంలో ఆయన తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. 3న రాష్ట్రంలోని అన్ని డిపోలు, గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

4న రాజకీయ పార్టీలతో డిపోల వద్ద దీక్ష, 5న సడక్ బంద్ రహదారుల దిగ్బంధం, 6న రాష్ట్ర వ్యాప్తంగా డిపోల ఎదుట నిరసన, 7న ఆర్టీసీ కార్మికుల కుటుంబ సభ్యులు, రాజకీయ పార్టీలతో డిపోల ముందు దీక్ష, 8న ఛలో ట్యాంక్ బండ్ సన్నాహక కార్యక్రమాలు, 9న ట్యాంక్ బండ్ పై దీక్ష, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.