1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : ఆదివారం, 28 జూన్ 2020 (11:48 IST)

ప్రభుత్వ భూముల పరిరక్షణకు కఠిన చర్యలు: కేటీఆర్

రాజధానిలో పరిధిలోని ప్రభుత్వ భూముల రక్షణకు చేపట్టాల్సిన చర్యలపైన ఈరోజు మంత్రులు కె. తారకరామారావు (కేటీఆర్), తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కూమార్ ఆధ్వర్యంలో ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది.

మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగిన ఈ సమావేశానికి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చేల్ జిల్లాల కలెక్టర్లతో పాటు రెవెన్యూ, ఎండోమెంట్, జిహెచ్ఎంసి, హెచ్ఎండిఎ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూములు ప్రయివేట్ వ్యక్తులకు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి కే తారకరామారావు సూచించారు.

ముఖ్యంగా రెవిన్యూ, దేవాదాయ భూముల పైన ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా మంత్రులు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ భూములను కాపాడటం కోసం ఇప్పటికే ఆయా శాఖల వద్ద ఉన్న సమాచారం మేరకు ఆయా స్థలాలకు జియో పెన్సింగ్ వేయడంతో పాటు జిఐఎస్ మ్యాపింగ్ చేయాలన్నారు.

ప్రభుత్వ భూములపైన ఉన్న వివాదాలను పరిష్కరించేందుకు కోర్టుల్లో బలమైన వాదనలు వినిపించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులను మంత్రులు ఆదేశించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, శేర్ లింగంపల్లి ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల పరిధిలో ఉన్న పలు సమస్యలను ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

ఇప్పటికే అర్హులైన పేదలకు జీవో నెంబర్ 58, 59 ద్వారా భూముల క్రమబద్ధీకరణ చేసి వారికి భూహక్కులను కల్పించిన విషయాన్ని అయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరోసారి ఇలాంటి అవకాశాన్ని కల్పించాలని ప్రజాప్రతినిధుల మాటను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.

అయితే గంపగుత్తగా అందరికీ అవకాశం కల్పించకుండా అంశాలవారీగా సానుకూల దృష్టితో పరిశీలించాలని ఈ సందర్భంగా యంఏల్యేలు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు. ప్రభుత్వ భూములను కాపాడేందుకు రెవెన్యూ డిపార్ట్ మెంట్ తో జిహెచ్ఎంసి అధికారులు సమన్వయం చేసుకోవాలని అన్నారు.

మరోవైపు ప్రభుత్వ ఖాళీ స్థలాలను ప్రజాప్రయోజనాలకు ఉపయోగించుకునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అధికారులను అదేశించారు. ముఖ్యంగా ఇలాంటి ప్రభుత్వ భూములు కబ్జాలకు గురికాకుండా, వాటిలో అక్రమ నిర్మాణాలు రాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ విషయంలో మరింత చోరవతో పనిచేయాలని సూచించారు.

దశాబ్దాల కింద తీసుకున్న లీజ్ లను సమీక్షించి, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా లీజ్ నియమ నిబంధనలు మార్చి ఆయా శాఖలకు మరింత ఆదాయం వచ్చేలా చూడాలన్నారు.