1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 ఆగస్టు 2021 (12:32 IST)

అంత్యక్రియలకు డబ్బులు లేక తాత శవాన్ని ఫ్రిజ్‌లో దాచిన మనువడు

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా పరకాలలో ఓ విషాదకర ఘటన ఒకటి వెలుగు చూసింది. అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో తాత మృతదేహాన్ని ఇంట్లోని ఫ్రిడ్జ్‌లోనే మనువడు దాచిపెట్టాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పోలీసులు వెల్లడించారు. కామారెడ్డికి చెందిన రిటైర్ట్ ఉద్యోగి బాలయ్య(93), తన మనవడు నిఖిల్ ఎనిమిది సంవత్సరాల క్రితం బతుకు దెరువు కోసం పరకాలకు వచ్చి స్థిరపడ్డారు. పట్టణంలోని ఓ అద్దె ఇంట్లో భార్య నర్సమ్మ, కొడుకు హరికిషన్, మనువడు నిఖిల్‌తో కలిసి ఉంటున్నారు. 
 
అయితే హరికిషన్ రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అప్పటికే అతని భార్య కూడా చనిపోవడంతో మనుమడి మంచి చెడులను తాత నానమ్మలే చూస్తున్నారు. ఈ క్రమంలో బాలయ్య భార్య నర్సమ్మ మూడు నెలల క్రితం కరోనాతో కన్నుమూసింది. అప్పటి నుంచి ఇంట్లో బాలయ్య, నిఖిల్ ఇద్దరే ఉంటున్నారు. బాలయ్యకు వచ్చే ఫించన్ డబ్బులతోనే ఇద్దరూ పొట్ట నింపుకుంటూ వస్తున్నారు. 
 
ఈ పరిస్థితుల్లో మూడు రోజుల క్రితం బాలయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని మనువడు నిఖిల్... తాత మృతదేహాన్ని ఇంట్లోని ఫ్రిడ్జ్‌లో కుక్కిపెట్టాడు. 
 
రోజులు గడిచేకొద్దీ ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు మనువడిని ప్రశ్నించారు. ఇంట్లో ఎలుకలు, ఇతర కీటకాలు చనిపోవడంతో వాసన వస్తుందని చెప్పుకుంటూ వచ్చాడు. అయితే, మూడు రోజులుగా నిఖిల్ గది నుంచి దుర్వాసన అధికంగా వస్తుండటంతో ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
దీంతో అక్కడికి చేరుకొని చూడగా ఫ్రిజ్‌లో కుక్కిపడేసిన బాలయ్య మృతదేహం ఉండటం చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీంతో నిఖిల్‌ను ప్రశ్నించగా.. అంత్యక్రయలకు డబ్బుల్లేక ఫ్రిజ్‌లో దాచానని చెప్పాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.