1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 మార్చి 2022 (13:32 IST)

బీజేపీకి షాక్.. ఈటెలతో పాటు ఆ ముగ్గురిపై సస్పెన్షన్ వేటు

తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే బీజేపీకి షాక్ తప్పలేదు. బీజేపీ శాసనసభాపక్ష నేత రాజా సింగ్‌ సహా రఘునందన్‌రావు, ఈటల రాజేందర్‌ను సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. 
 
గవర్నర్ ప్రసంగం లేదంటూ బీజేపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగిన నేపథ్యంలో మంత్రి హరీశ్‌ రావు బడ్జెట్ ప్రసంగానికి అడ్డుతగులుతున్న బీజేపీ సభ్యులను సస్పెండ్ చేయాలంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీర్మానం ప్రవేశపెట్టారు. 
 
దీనికి సభ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలోనే సమావేశాలు ముగిసేవరకు బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
 
బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజా సింగ్, రఘునందన్ రావు అసెంబ్లీ లోపల గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు ఎంత చెప్పినా ఆందోళన ఆపకపోవడంతో మార్షల్స్ సహాయంతో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను వాహనాల్లో అసెంబ్లీ నుంచి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
 
అంతకు ముందు గన్ పార్క్ లో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు. నిర్బంధపాలన నశించాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కేసీఆర్ తీరుపై మండిపడ్డారు. 
 
సీఎం కేసీఆర్ 40 సంవత్సరాలుగా వస్తున్న విధానాన్ని తుంగలో తొక్కి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేశారని ఫైర్ అయ్యారు.