1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

దళితబంధుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకాన్ని మరో నాలుగు మండలాల్లో అమలు చేయాలని ప్రభుత్వం భావించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పథకం అమలుకు సంబంధించి సీఎం కేసీఆర్ రేపు సమీక్ష నిర్వహించున్నారు.
 
దళితబంధును హుజూరాబాద్‌ నియోజకవర్గం, వాసాలమర్రిలో ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ పథకాన్ని మరో నాలుగు ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లో అమలు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం నాలుగు మండలాలను ఎంపిక చేశారు. ఈ మండలాల్లో పథకం అమలుపై సోమవారం ప్రగతిభవన్‌లో నిర్వహించనున్నారు. 
 
ఎంపిక చేసిన మండలాల్లో మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం, తుంగతుర్తిలోని తిరుమలగిరి, అచ్చంపేట - కల్వకుర్తి నియోజకవర్గాల్లోని చారగొండ, జుక్కల్‌ నియోజకవర్గంలోని నిజాంసాగర్‌ మండలాల్లో దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 
 
సన్నాహక సమావేశానికి ఎస్సీ కులాల అభివృద్ధి సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలకు చెందిన మంత్రులు, ఆయా జిల్లాల జడ్పీ ఛైర్మన్లు, కలెక్టర్లు, సంబంధిత నియోజకవర్గాల శాసనసభ్యులు, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖ, సీఎం కార్యాలయ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా హాజరవుతారు. పథకం తీరుతెన్నులను వివరించేందుకు క్షేత్రస్థాయి అనుభవం కలిగిన కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొంటారు.