1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

టీచర్ వేసిన శిక్షకు కాళ్లలో స్పర్శను కోల్పోయిన డిగ్రీ విద్యార్థిని

woman victim
తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్లా జిల్లా వేములవాడలో ఓ విద్యార్థిని పట్ల క్లాస్ టీచర్ దారుణంగా ప్రవర్తించింది. స్కూలుకు రానందుకు ఏకంగా ఐదు రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు కాళ్ళపై నిలబెట్టింది. దీంతో ఆ యువతి కాళ్లలో స్పర్శను కోల్పోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలానికి చెందిన ఓ విద్యార్థిని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని సాంఘిక సంక్షేమశాఖ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్‌ తృతీయ సంవత్సరం చదువుతోంది. ఈ నెల 18న అనారోగ్యంగా ఉందని ఒక రోజు సెలవు పెట్టి వెళ్లిన విద్యార్థి 23న కళాశాలకు వచ్చింది. 
 
ఆలస్యంగా వచ్చిన ఆ విద్యార్థినిని అధ్యాపకురాలు డి.మహేశ్వరి ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వరసగా అయిదు రోజులపాటు నిలబెట్టింది. దీంతో ఆమె కాళ్లలో స్పర్శ కోల్పోయి నడవలేని పరిస్థితి ఏర్పడింది. ఆదివారం తోటి విద్యార్థుల సాయంతో వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రిలో చేరింది. 
 
వైద్యులు వివిధ పరీక్షలు చేసి అనంతరం ఎమ్మారై స్కానింగ్‌ కోసం సిరిసిల్లలోని జిల్లా ఆసుపత్రికి పంపించారు. ఈ ఘటనపై కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి స్పందించారు. అధ్యాపకురాలు మహేశ్వరిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రిన్సిపల్‌గా వ్యవహరిస్తున్న మాతంగి కల్యాణిపై తగిన చర్యల కోసం ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు. దీంతో ప్రిన్సిపల్‌ కల్యాణి శనివారం ఉన్నతాధికారులు బదిలీ చేశారు.