శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 5 మార్చి 2021 (14:53 IST)

బుల్లెట్ రైలుకు గుజరాత్ మాత్రమే అర్హత ఉందా?

దేశంలో బుల్లెట్ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం బుల్లెట్ రైలు మార్గాన్ని ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు నిర్మిస్తున్నారు. భారత్ - జపాన్ ప్రభుత్వాలు కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు సర్వే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే, తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. బుల్లెట్‌ రైలు గుజరాత్‌కేనా?.. హైదరాబాద్‌కు అర్హత లేదా? అని ప్రశ్నించారు. ఏ ఒక్క రాజకీయ నేత అయినా ఎన్నికల కోసం కాకుండా ప్రజల కోసం.. దేశం కోసం పనిచేయాలని హితవు పలికారు.
 
హైదరాబాద్‌ బేగంపేటలోని ఐటీసీ కాకతీయలో సీఐఐ వార్షిక సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, వరంగల్‌ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ కోసం 60 ఎకరాలు అడిగితే 150 ఎకరాలు ఇచ్చామని, అయినా కోచ్‌ ఫ్యాక్టరీ రాలేదన్నారు. ఇపుడు అస్సలు తెలంగాణాకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అక్కర్లేదని అంటున్నారని చెప్పారు. 
 
మేకిన్‌ ఇండియా అంటున్న కేంద్రం.. రాష్ట్రానికి ఒక్క ఇండస్ట్రియల్‌ జోన్‌ కూడా కేటాయించలేదన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హమీలు అమలు చేయడంలేదని, ఐటీఐఆర్‌ కారిడార్‌ను రద్దు చేసి తెలంగాణకు అన్యాయం చేశారన్నారు. 
 
రాష్ట్రం నుంచి అధిక ఆదాయం పొందుతున్న కేంద్రం .. తగిన కేటాయింపులు చేయకుండా అన్యాయం చేస్తోందన్నారు. కేంద్ర హామీలిచ్చి నెరవేర్చకపోతే ఎవర్ని అడగాలని ఆవేదన వ్యక్తం చేశారు. దిగుమతి సుంకాలు పెంచి... మేకిన్‌ ఇండియా అంటే కంపెనీలు వస్తాయా? అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు.  
 
ఇండియా టీకాల రాజధానిగా తెలంగాణ అవతరించిందన్నారు. ఐటీ, లైఫ్ సైన్సెస్‌, ఫార్మా, నిర్మాణ రంగాల్లో అగ్రస్థానంలో ఉన్నామన్నారు. ఐటీ దిగుమతులు రూ.1.40లక్షల కోట్లకు చేరాయన్నారు. అంకురాలతో తెలంగాణ ఇన్నోవేషన్‌ హబ్‌గా మారుతోందన్నారు. స్పెషల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. డిఫెన్స్‌, ఏరో స్పేస్‌ రంగానికి హైదరాబాద్‌ నిలయంగా ఉందని కేటీఆర్‌ అన్నారు. 
 
అలాంటి నగరానికి బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు అర్హత లేదా అని ప్రశ్నించారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఒక్క అహ్మదాబాద్ నగరానికే అర్హత ఉందా అని కేటీఆర్ నిలదీశారు. రాజకీయ నేతలు దేశం కోసం పని చేయాలని, ప్రాంతీయాభిమానం, ఎన్నికల05-1 కోసం పని చేయరాదని హితవు పలికారు.