గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (19:59 IST)

వైఎస్ షర్మిలకు మద్దతు ప్రకటించిన రెడ్డి సంఘాలు

తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నట్టు మాజీ ముఖ్యమత్రి దివంత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల ప్రకటించారు. ఆ దిశగా ఆమె వడివడిగా అడుగులు వేస్తున్నారు. పార్టీ ఏర్పాటులో భాగంగా, ఆమె జిల్లాల వారీగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో పార్టీ నేతలు ఇస్తున్న క్షేత్రస్తాయి సమాచారాన్ని తీసుకుంటున్నారు. 
 
అదేసమయంలో ఆమె అడుగులు తెలంగాణాలో రాజకీయ వేడిని పెంచుతున్నాయి. ఆమెకు మద్దతు పలుకుతున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడమే తన లక్ష్యమని ప్రకటించిన ఆమెకు... వైయస్ అభిమానులు అండగా నిలుస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో షర్మిలను రెడ్డి సంఘాల నేతలు కలిశారు. షర్మిల పెట్టబోతున్న పార్టీకి తమ సహకారం పూర్తిగా ఉంటుందని చెప్పారు. షర్మిలతో భేటీ అనంతరం రెడ్డి సంఘాల జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు నవల్ల సత్యనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
తెలంగాణలోని రెడ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారన్నారు. రాష్ట్రంలో రెడ్లకు రాజకీయంగా దిక్కు లేకుండా పోయిందని, ప్రాధాన్యత తగ్గిపోయిందని మండిపడ్డారు. రెడ్డి కార్పొరేషన్ ఇస్తామని చెప్పిన కేసీఆర్... ఇంతవరకు ఇవ్వలేదని విమర్శించారు. షర్మిల పార్టీతో తెలంగాణలో రెడ్లకు పూర్వ వైభవం వస్తుందని అన్నారు. షర్మిలకు రాష్ట్రంలోని రెడ్లంతా మద్దతు పలుకుతారని చెప్పారు.