1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎంజీ
Last Updated : గురువారం, 18 నవంబరు 2021 (19:42 IST)

బాయిల్డ్ రైస్‌ను తీసుకోం: కేసీఆర్ కు స్పష్టం చేసిన కేంద్రం

పార్ బాయిల్డ్ రైస్‌ను తీసుకోబోమని కేంద్ర ప్రభుత్వం గురువారం స్పష్టం చేసింది. యాసంగి పంట ధాన్యం కూడా పరిమితంగానే కొంటామని పేర్కొంది. రబీ పంట సేకరణకు సంబంధించి రాష్ట్రాలతో చర్చించిన తర్వాత వచ్చే ఏడాది ఎంత సేకరించాలో నిర్ణయం తీసుకుంటామని కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది.

‘‘ఒక్కో రాష్ట్రం నుంచి డిమాండ్ ఒక్కో విధంగా ఉంటుంది. డిమాండ్లకు అనుగుణంగా రాష్ట్రాలతో జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం. ఇప్పటి వరకు జరిగిన నిర్ణయాల ప్రకారం బాయిల్డ్ రైస్ కేంద్రం కొనదు. వరి, గోధుమ పంటను తక్కువ పండించాలని రాష్ట్రాలను కోరుతున్నాం. ప్రస్తుతం.. దేశంలో నిల్వలు సరిపడా ఉన్నాయి.

అవకాశం ఉన్నంత మేరకు ఎగుమతి చేయడానికి ఉన్న అవకాశాలను పరిగణనలోకి తీసుకుంటున్నాం. ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లాలని సూచనలు చేస్తున్నాం. ఆయిల్, పప్పు ధాన్యాలు ఎక్కువ పండించాలని అన్ని రాష్ట్రాలకు సూచనలు చేస్తున్నాం. రాష్ట్రాలు ఎంత వరకు సేకరించగలుగుతాయో అంత వరకే పరిమితం కావాలని చెబుతున్నాం.’’ అని కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది.

తెలంగాణ రాష్ట్ర రైతులు పండిస్తున్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ మహాధర్నా చేస్తున్న రోజే కేంద్రం ఇలా కౌంటర్ ఇవ్వడం సంచలనంగా మారింది.