1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 నవంబరు 2021 (11:59 IST)

కేఎంసీ వైద్య కాలేజీ ర్యాగింగ్ కలకలం.. ప్రధాని - హోం మంత్రికి లేఖ

తెలంగాణ రాష్ట్రం వరంగల్‌లో ఎంతో పేరుగాంచిన కాకతీయ మెడికల్ కళాశాల (కేఎంసీ)లో ర్యాగింగ్ కలకలం వెలుగు చూసింది. ఓ విద్యార్థి ట్వీట్‌తో ఆదివారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
ఫ్రెషర్స్ డే పేరుతో కొందరు సీనియర్ విద్యార్థులు మద్యం సేవించి ఆ మత్తులో తమను ర్యాగింగ్ చేస్తున్నారంటూ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి అమిత్ షా, తెలంగాణ మంత్రి కేటీఆర్, డీజీపీ, రాష్ట్ర వైద్యసంచాలకుడిని ట్యాగ్ చేస్తూ ఓ విద్యార్థి ట్వీట్ చేశాడు. 
 
ఇందులో 2017 బ్యాచ్‌కు చెందిన 50 మంది విద్యార్థులు మద్యం తాగి తమను వేధిస్తున్నట్టు ఆ ట్వీట్‌లో ఫిర్యాదు చేశాడు. 
 
ఈ ఘటనపై ఆరా తీసిన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేశ్‌ రెడ్డి నేడు కళాశాలలో జరగాల్సిన ఫ్రెషర్స్ డేకు అనుమతి ఇవ్వొద్దని సూచించినట్టు తెలుస్తోంది. కాగా, విద్యార్థి ట్వీట్‌ను పరిగణనలోకి తీసుకున్న పోలీస్ కమిషనర్ ఆదేశాలతో మట్టెవాడ పోలీసులు నిన్న కేఎంసీలో విచారణ జరిపారు. 
 
ర్యాగింగ్‌పై విద్యార్థులు ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు.
 
అలాగే, విద్యార్థి ఫిర్యాదును కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్‌దాసు కొట్టిపడేశారు. ర్యాగింగ్ వార్త నిజం కాదన్నారు. కళాశాలలో సీనియర్, జూనియర్ విద్యార్థుల హాస్టల్ భవనాలు దూరదూరంగా ఉంటాయన్నారు. సీనియర్ విద్యార్థులు కొందరు జన్మదిన వేడుకలు చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని కొందరు ఇలా ప్రచారం చేస్తున్నారంటూ వ్యాఖ్యానించడం గమనార్హం.