ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 9 మే 2023 (18:16 IST)

ప్రయాణికులకు శుభవార్త .. తిరుపతి వందే భారత్ రైలు బోగీల పెంపు

vande bharat express
సికింద్రాబాద్‌ - తిరుపతి నగరాల మధ్య సేవలందిస్తున్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ప్రస్తుతం ఎనిమిది కోచ్‌లతో నడుస్తున్న ఈ సెమీ-హైస్పీడ్‌ రైలులో బోగీల సంఖ్యను పెంచాలన్న అభ్యర్థనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 
 
తిరుమల భక్తులతో రైలులో రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ రైలులో బోగీలను రెట్టింపు చేసేందుకు అంగీకరించింది. రైలులో ప్రస్తుతం ఉన్న 8 కోచ్‌లను 16కి పెంచేందుకు కేంద్రం అంగీకరించినట్టు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన ట్వీట్‌ చేశారు. 
 
సికింద్రాబాద్‌ - తిరుపతి వందే భారత్‌ రైలులో 120 నుంచి 130 శాతం మేర ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతోంది. చాలా మంది ప్రయాణికులు రిజర్వేషన్లు దొరక్క ఈ రైలులో వెళ్లాలనుకున్నా ప్రయాణించలేకపోతున్నారు. ఈ విషయాన్ని మీడియా సంస్థలు బహిర్గతం చేశాయి. ఇది కిషన్ రెడ్డి దృష్టికి వెళ్లింది. 
 
ఆయన దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ను పిలిచి తిరుపతి వందేభారత్‌ రైలులో బోగీల సంఖ్యను పెంచే విషయంపై ఆరా తీశారు. దీంతో ఈ రైలుకు ఉన్న డిమాండ్‌ను వివరిస్తూ ద.మ.రైల్వే అధికారులు రైల్వే బోర్డుకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కసరత్తు ప్రారంభించిన రైల్వే బోర్డు తాజాగా వందేభారత్‌ రైలులో కోచ్‌లను రెట్టింపు చేసేందుకు అంగీకరించడం విశేషం.