1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: సోమవారం, 8 జూన్ 2020 (16:10 IST)

న్యాయం చేయకపోతే ఇక్కడే సచ్చిపోతాం సారూ

న్యాయం చేయకపోతే ఇక్కడే సచ్చిపోతాం సారూ... అంటూ తహసీల్దార్ ఆఫీస్ ముందు బాధితులు ఆవేదన వ్యక్తి చేస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ వద్ద పేషీ పెండింగ్‌లో 13 ఎకరాల పైచిలుకు భూమికి సంబంధించి తమ ప్రత్యర్థులు నిబంధనలు ఉల్లంఘిస్తుంటే పట్టించుకోవాల్సిన కొత్తూరు రెవిన్యూ శాఖ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని, దీనివల్ల తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కొత్తూరు మండలం పెంజర్లకు చెందిన కొంతమంది బాధితులు రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల తాసిల్దార్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.
 
మండలంలోని సర్వే నెంబర్ 241, 251, 252లో గల మొత్తం 13 ఎకరాల ఒక గుంట భూమిలో వివాదం నడుస్తోంది. ఈ కారణంగా జాయింట్ కలెక్టర్ వద్ద కేసు పెండింగ్ ఉందని పేర్కొన్నారు. అయినప్పటికీ... తమ ప్రత్యర్థులు అక్రమంగా భూమిలోకి ప్రవేశించి ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి భూమి దున్నుతున్నారని, అదేవిధంగా లాక్ డౌన్ సమయంలో బోరు కూడా వేశారని తెలిపారు.
 
ఈ విషయంలో అధికారులకు ఫిర్యాదు చేయగా సరైన చర్య తీసుకోకపోవడం వల్ల నిబంధనలు బేఖాతరు అవుతున్నాయని కొత్తూరు మండలం పెంజర్ల గ్రామానికి చెందిన షేక్ యూసుఫ్ ఉద్దీన్, షేక్ గౌస్ ఉద్దీన్, షేక్ బురానుద్దీన్, కర్రె మహబూబ్ సాబ్ తదితరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం కొత్తూరు మండల తాసిల్దార్ కార్యాలయం ముందు న్యాయం కోసం ఆందోళన వ్యక్తం చేశారు.
 
రెవిన్యూ శాఖ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని పరిష్కారం అయ్యేంతవరకు ఇరువర్గాలు భూమిలోకి వెళ్లకూడదని ఆదేశించగా దీనిని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తూరు అధికారులు స్పందించకపోతే తాము కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. అధికారులు స్పందించి తమ వివాదాస్పద భూమిలో ఎవరు ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.