శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 ఏప్రియల్ 2020 (12:12 IST)

కేసీఆర్ శాపాలు అక్బరుద్దీన్‌కు తగలవా? విజయశాంతి ప్రశ్న

సినీ నటి, మాజీ ఎంపి విజయశాంతి మరోమారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓ రేంజ్‌లో టార్గెట్ చేశారు. హైదరాబాద్ నగరంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ బారినపడిన రోగులకు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై ఎంఐఎం నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్ర విమర్శలు చేశారు. గాంధీ ఆస్పత్రి ఓ జైలులా ఉందని వ్యాఖ్యానించారు. పైగా, కరోనా పాజిటివ్ బాధితులకు అందిస్తున్న చికిత్స ఏమాత్రం బాగోలేదని అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు తెలంగాణాలో పొలిటికల్ హీట్‌ను పెంచాయి. ఈ వ్యాఖ్యలపై మాజీ ఎంపీ విజయశాంతి స్పందించారు. ఫేస్‌బుక్ వేదికగా కేసీఆర్‌కు ఆమె పలు ప్రశ్నలు సంధించారు. 
 
'కరోనా పాజిటివ్ కేసులుగా నిర్ధారణ అయిన వారికి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న తీరుపై ఎంఐఎం శాసనసభ సభ్యుడు అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగింది. ప్రపంచమంతా కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్న తరుణంలో.. కొన్ని లోపాలున్నా, వాటిని పట్టించుకోకుండా అందరూ ప్రభుత్వానికి బాసటగా నిలవాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌గారు ఈ మధ్య ప్రెస్మీట్‌లో స్పష్టం చేశారు. అంతటితో ఆగకుండా గాంధీ ఆస్పత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేవని రాసిన కారణంగా ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణగారికి కరోనా రావాలని కేసీఆర్‌గారు శాపం పెట్టారు.
 
వైద్య సదుపాయాలు లేవు అన్నందుకే కరోనా రావాలన్న కేసీఆర్ గారు... మరి, గాంధీ ఆసుపత్రి జైలు మాదిరిగా ఉందని విమర్శించిన అక్బరుద్దీన్ గారిపై ఎలాంటి శాపనార్థాలు పెడతారోనని తెలంగాణ ప్రజలు భయపడుతున్నారు. గాంధీ ఆసుపత్రి జైలులాగా ఉందని విమర్శించిన అక్బరుద్దీన్‌గారికి బహుశా కేసీఆర్‌గారు పెట్టిన శాపం గురించి తెలిసి ఉండకపోవచ్చు. లేదా కేసీఆర్‌గారు, తాను ఒకటే కనుక ఈ శాపాలు తనకు వర్తించవని అక్బరుద్దీన్‌గారిలో ధీమా ఉండి ఉండొచ్చు. లేదా మాకు ఈ శాపాలు తగలవని... తాము అన్నిటికీ అతీతమని అక్బరుద్దీన్‌గారు భావించి ఉండొచ్చు. మరి రాబోయే రోజుల్లో అక్బరుద్దీన్ కామెంట్స్‌పై కేసీఆర్ గారు శాపం పెడతారా? లేక చూసీ చూడకుండా సర్దుకుపోతారా? అనే విషయాన్ని వేచి చూడాలి' అని విజయశాంతి వ్యాఖ్యానించారు.