గురువారం, 4 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 నవంబరు 2023 (22:10 IST)

కాంగ్రెస్‌లో చేరనున్న విజయశాంతి..?

తెలంగాణలో బీజేపీకి గట్టి షాక్ తగలనుంది. బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్‌లో చేరనున్నారు. విజయశాంతి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి ప్రకటించారు. గత కొంత కాలంగా విజయశాంతి బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా కార్యక్రమాలకు కూడా ఆమె హాజరు కావడం లేదు. 
 
బీజేపీ నాయకత్వంపై ఆమె అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఆమె పార్టీ మారతారని చాలా రోజులుగా ప్రచారం సాగుతోంది. మల్లు రవి తాజా ప్రకటనతో ఇది ఖరారైంది. అయితే దీనిపై విజయశాంతి ఇంకా స్పందించలేదు.
 
విజయశాంతి బీజేపీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఆమె త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత మల్లు రవి ప్రకటించారు. శనివారం మీడియాతో మల్లు రవి మాట్లాడుతూ.. తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ జరుగుతుందన్నారు. విజయశాంతి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారని వ్యాఖ్యానించారు. 
 
తెలంగాణలో బీజేపీ అధిష్టానంపై ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే కొందరు నేతలు కాంగ్రెస్‌లో చేరారు. గత కొంత కాలంగా విజయశాంతి కూడా బీజేపీ నాయకత్వంపై ఆసక్తిగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆమె పెద్దగా పాల్గొనడం లేదు.
 
 అసెంబ్లీ ఎన్నికల్లో విజయశాంతికి బీజేపీ టిక్కెట్టు కేటాయించకపోవడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీకి విజయశాంతి గుడ్‌బై చెప్పనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.