శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 12 అక్టోబరు 2018 (20:18 IST)

క్యాంప్ వుందని మరో మహిళతో ఉపాధ్యాయుడు... అనుసరించి పట్టేసిన భార్య

వివాహం జరిగినా వేరొక అమ్మాయితో సహజీవనం చేస్తున్న ఉపాధ్యాయుడిని అతడి భార్య దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది. సిరిసిల్ల జిల్లా కేంద్రం వేములవాడలో శ్రీనివాస్‌ చెక్కపల్లి ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడి భార్య పద్మ తెలిపిన వివరాల ప్రకారం... 20 ఏళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లాకు చెందిన పద్మను ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు శ్రీనివాస్. 
 
పద్మ కూడా ఎదురుగట్ల ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాలుగు నెలలుగా శ్రీనివాస్ స్కూల్ ముగిసినా ఇంటికి రాకపోవడం, రాత్రిళ్లు క్యాంప్‌లు ఉన్నాయంటూ బయటకు వెళ్లిపోతుండటంతో భర్త ప్రవర్తనపై పద్మకు అనుమానం కలిగింది. శ్రీనివాస్‌ దినచర్యపై ఆరా తీసింది. దీంతో సిరిసిల్ల పట్టణం సర్ధార్‌నగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ వేములవాడకు చెందిన మరో మహిళతో సహజీవనం చేస్తున్నట్లు తెలుసుకుంది.
 
భార్య పద్మ మహిళా సంఘాలు ఇతర కుటుంబసభ్యులతో కలిసి సిరిసిల్లకు వచ్చి ఇంట్లోకి చొరబడి శ్రీనివాస్‌, సదరు మహిళను పట్టుకొని దేహశుద్ధి చేసింది. దీంతో సదరు మహిళ శ్రీనివాస్‌ తనను వివాహం చేసుకున్నాడని పద్మతో వాగ్వాదానికి దిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని శ్రీనివాస్‌తో పాటు మహిళను అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. నాలుగు నెలలుగా తన భర్తను ఇంటికి రావడం లేదని, చిట్‌ఫండ్‌లో తీసుకున్న రూ.8 లక్షలు, 10 తులాల బంగారం ఆమెకు ఇచ్చాడని పద్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.