1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 జులై 2021 (18:32 IST)

షర్మిల కొత్త పార్టీ పేరు... వైఎస్సార్ తెలంగాణ పార్టీ

వైఎస్ఆర్ కుమార్తె వైఎస్. షర్మిల కొత్త పార్టీని పెట్టారు. తన పార్టీ పేరును వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా నామకరణం చేశారు. ఈ మేరకు గురువారం జరిగిన ఆవిర్భావ సభలో ప్రకటించారు. హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఆమె ప్రసంగించారు. 
 
జోహార్ వైఎస్సార్, జై తెలంగాణ నినాదాలతో షర్మిల తన ప్రసంగం ప్రారంభించారు. కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయిన సంక్షేమ సంతకం వైఎస్సార్ అని తెలిపారు. మా నాన్న మాట ఇస్తే బంగారు మూట ఇచ్చినట్టేనని పేర్కొన్నారు. శత్రువులు సైతం ప్రశంసించిన నేత వైఎస్సార్ అని కొనియాడారు.
 
గురువారం ఆయన జయంతి అని, ఇది మనందరికీ పండుగ రోజని తెలిపారు. ఆయన చూపిన బాటలో నడవడానికి, ఈ రోజు ఆయన పుట్టినరోజున మన పార్టీ 'వైఎస్సార్ తెలంగాణ పార్టీ'ని స్థాపిస్తున్నామని షర్మిల ప్రకటన చేశారు. 
 
మరోసారి సంక్షేమ రాజ్యం తీసుకువచ్చేందుకు వైఎస్సార్ 72వ జయంతి రోజున 'వైఎస్సార్ తెలంగాణ పార్టీ' ఏర్పాటు ప్రకటన చేస్తున్నామని వెల్లడించారు. 
 
సభలో షర్మిల మాట్లాడుతూ.. తమ పార్టీ అజెండాలో మూడు ముఖ్యమైన అంశాలను ప్రకటించారు. సంక్షేమం.. స్వయం సంవృద్ధి.. సమానత్వం సాధన దిశగా తమ పార్టీ సాగుతుందన్నారు.
 
నాన్న మాట ఇస్తే బంగారు మూట ఇచ్చినట్టేనని, శత్రువులు సైతం ప్రశంసించిన నేత వైఎస్ అని ఆమె పేర్కొన్నారు. ఆయన జయంతి రోజున ఆయన అడుగుల్లో నడిచేందుకు వైఎస్ఆర్‌టీపీని స్థాపించామన్నారు. 
 
ఆయన సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడానికి వచ్చామన్నారు. ఇవాళ్టికీ వైఎస్ ఓ రోల్ మోడల్ అన్నారు. రుణమాఫీ, ఉచిత విద్యుత్.. పావలా వడ్డీ ఇచ్చారని, కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని జలయజ్ఞానికి రూపకల్పన చేసిన దార్శనికుడు వైఎస్ అన్నారు. 
 
డాక్టరా.. ఇంజినీరా.. ఎంబీయేనా అన్నది తేడా లేకుండా ఉచిత చదువులకు అవకాశం ఇచ్చిన నేత ఆయన అన్నారు. పేద విద్యార్థులకు వందశాతం ఫీజు రీయింబర్స్ మెంట్ కల్పించారని, ఆరోగ్యశ్రీ ఇచ్చిన నేత అన్నారు.