1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 8 జులై 2021 (19:38 IST)

కేసీఆర్‌ కుటుంబం దోచుకుని దాచుకుంటోంది: వైఎస్ షర్మిల

వైఎస్‌ సంక్షేమ పాలన తేవడమే వైఎస్సార్‌ టీపీ లక్ష్యమని వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీని ప్రకటించిన ఆమె సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగులు బడ్జెట్‌ ఉన్న తెలంగాణలో పేదరికం పోలేదని వ్యాఖ్యానించారు. రూపాయి బియ్యం కోసం ఇంకా రేషన్‌ షాపుల ఎదుట లైన్లు ఉంటున్నామని ఆమె పేర్కొన్నారు.

‘‘అధికారం ఉన్నప్పుడే ఫామ్‌హౌస్‌ చక్కబెట్టుకుంటున్నారు. కేసీఆర్‌ కుటుంబం దోచుకుని దాచుకుంటోంది. పేదరికం నుంచి బయటపడింది కేసీఆర్‌ ఫ్యామిలీనే. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ఉంటే పేదలకు భరోసా ఉండేది. కరోనాకు ఎంతో మంది బలైపోయారు.. ఆస్తులమ్ముకున్నారు.

సంక్షేమంలో దేశంలోనే నెంబర్‌ వన్‌ అని చెప్పుకుంటున్న కేసీఆర్‌ ఆస్తులమ్ముకున్న కుటుంబాలకు ఏం సమాధానం చెబుతారు?. తప్పైందని ముక్కు నేలకు రాస్తే కేసీఆర్‌ పాపం పోతుందా?. వైఎస్‌ సంక్షేమం అంటే భరోసా, రక్షణ, భద్రత. వైఎస్‌ సంక్షేమం అంటే కరోనాలాంటి ఎన్ని విపత్తులు వచ్చినా అప్పులపాలు కాకుండా నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా పొందడం వైఎస్‌ బతికి ఉంటే అదే చేసేవారు.’’ అని షర్మిల తెలిపారు. 
 
షర్మిల ఇంకా మాట్లాడుతూ ‘‘కేసీఆర్‌ సంక్షేమం అంటే పథకాలు ప్రకటించి దిక్కులు చూడాలి. ఆరోగ్య కార్డులు ఇవ్వాలి.. ఆరోగ్యాన్ని గాలికి వదిలేయాలి. రైతుభరోసా ఇచ్చి ఆ డబ్బును వడ్డీ కింద జమకట్టుకోవాలా?. కేసీఆర్‌ సంక్షేమం అంటే ఇంటికో ఉద్యోగం అని చెప్పి ఏళ్లు గడిచినా వాయిదా వేసుకోవాలి. 6 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే చనిపోయినవారు రైతులు కాదని చెప్పడం సంక్షేమమా?.

కేసీఆర్‌ సంక్షేమం అంటే గారడీ మాటలు.. చేతికి చిప్పలు. ఎవరిని అడిగినా సంక్షేమానికి రారాజు వైఎస్సార్‌ అని చెబుతారు. పేదరికాన్ని రూపుమాపడమే వైఎస్సార్‌ టీపీ లక్ష్యం. తరాలు మారినా తలరాతలు మారడం లేదు. సంక్షేమమంతా రేషన్‌ బియ్యం చుట్టూనే తిరుగుతోంది. సంక్షేమం ఆకలి తీర్చి ఆగిపోతోంది.. ఉపాధి కల్పించడంలేదు.’’ అని పేర్కొన్నారు.