Soumith Rao: మ్యూజికల్ లవ్ డ్రామాగా నిలవే రాబోతుంది
Soumith Rao, Shreyasi Sen
సౌమిత్ పోలాడి హీరోగా శ్రేయాసి సేన్ నాయికగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం నిలవే. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ప్రకటించారు.
బిగ్గెస్ట్ మ్యూజికల్ లవ్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం, భావోద్వేగాలతో పాటు కొత్త ఆలోచనలతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందినట్టు చిత్ర బృందం వెల్లడించింది. ఈ చిత్రంలో హర్ష చెముడు, సుప్రియా ఐసోలా, రూపేష్ మారాపు, జీవన్ కుమార్, గురురాజ్, సిద్ధార్థ్ గొల్లపూడి, అనాల సుశ్మిత తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. విభిన్నమైన పాత్రలతో ప్రతి నటుడు తనదైన ముద్ర వేయనున్నారని దర్శక నిర్మాతలు తెలియజేశారు.
ఈ సినిమాకు కళ్యాణ్ నాయక్ సంగీతం అందించగా, దిలీప్ కే కుమార్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఎమ్వి.ఎస్. భరద్వాజ్ రాసిన పాటలకు కోటి అదనపు లిరిక్స్ అందించారు. సత్య.జి ఎడిటింగ్తో సినిమా మరింత ఆసక్తికరంగా రూపుదిద్దుకుంది. ప్రొడక్షన్ డిజైనర్స్గా కట్ట శివరామ కృష్ణ, జియా ఘోష్ పనిచేయగా, నూరా సయ్యద్ అదనపు ప్రొడక్షన్ డిజైనర్గా వ్యవహరించారు. సహ-నిర్మాతలుగా వెంకట్ కొణకండ్ల, సంజనా కృష్ణ, వ్యవహరించిన ఈ చిత్రం, కంటెంట్ పరంగా ప్రత్యేకంగా నిలుస్తుందని, ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందిస్తుందని చిత్ర యూనిట్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. మొత్తంగా, కొత్తదనంతో పాటు భావోద్వేగాల సమ్మేళనంగా రూపొందిన నిలవే చిత్రం ఫిబ్రవరి 13న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది.