1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 31 మే 2021 (11:11 IST)

నెల్లూరు జీజీహీచ్‌లో ప్రాణం విడిచిన కోటయ్య... ఎలా?

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామంలో ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ఇచ్చిన మందు తీసుకున్న హెడ్మాస్టర్ కోటయ్య చనిపోయారు. నిజానికి ఈయన కరోనా వైరస్ సోకింది. ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. కానీ ఆనందయ్య మందు విషయం తెలుసుకున్న కోటయ్యను కారులో చావుబతుకుల మధ్య తీసుకొచ్చారు. అక్కడ కోటయ్యకు ఆనందయ్య శిష్యులు కంట్లో పసురు మందు వేసిన కొద్ది సేపటికే లేచి కూర్చొన్నారు. ఇది ఓ సంచలనంగా మారింది.
 
నిజానికి కరోనా వైరస్ బారినపడిన కోటయ్య... ఎన్నో ఆసుప‌త్రులు తిరిగినా మెరుగుప‌డ‌లేదు. త‌న ఆరోగ్యం ఆనంద‌య్య మందు వేసుకోగానే నిమిషాల్లో మెరుగుప‌డింద‌ని ఇటీవ‌ల‌ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌కు సంబంధించిన వీడియో బాగా వైర‌ల్ అయింది.
 
అయితే, అనంత‌రం మ‌ళ్లీ అనారోగ్యం పాలైన కోటయ్య జిల్లా ప్రధాన ఆస్పత్రిలో చికిత్స పొందారు. చివరికి ఆరోగ్యం విష‌మించ‌డంతో ఆయన మృతి చెందారు. కంట్లో చుక్కలు వేసుకున్న వారం రోజుల అనంత‌రం కోటయ్య ఆరోగ్యం క్షీణించడంతో, ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనను చేర్చారు.
 
అనంత‌రం పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం ఈ నెల 22న‌ నెల్లూరు జీజీహెచ్‌కి తరలించగా అప్ప‌టి నుంచి ఆయ‌న‌ అక్కడే చికిత్స పొందుతూ మరణించారు. మ‌రోవైపు, ఆనంద‌య్య మందు కోసం ఇప్ప‌టికీ జ‌నాలు కృష్ణప‌ట్నం వ‌చ్చే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణ‌ప‌ట్నంలో 144 సెక్ష‌న్ విధించారు. కానీ, ఆనందయ్యను మాత్రం పోలీసులు ఎక్కడికి తరలించారో ఇప్పటివరకు తెలియలేదు.