గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 మే 2020 (13:56 IST)

తండ్రిని కూర్చోబెట్టుకుని 1200 కిమీ సైకిల్ తొక్కిన యువతి.. (video)

కరోనా వైరస్‌తో పాటు లాక్డౌన్ కష్టాలు అన్నీఇన్నీకావు. ఉపాధి కోల్పోవడంతో అనేక మంది వలస కూలీలు, వలస కార్మికులు తమ సొంతూళ్ళకు బయలుదేరారు. అయితే, వీరు తమ గమ్యస్థానాలు చేరుకునేందుకు ఎలాంటి రవాణా సౌకర్యాలు లేకపోవడంతో కాలినడకనే కొందరు, సైకిళ్ళపై మరికొందరు వెళ్లిపోతున్నారు. అయితే, నిరుపేద వలసలు మాత్రం తమ కాళ్లే చక్రాలుగా మారిపోయాయి. ఈ క్రమలో ఓ యువతి తన తండ్రిని కూర్చోబెట్టుకుని 1200 కిలోమీటర్ల మేరకు సైకిల్ తొక్కుకుని సొంతూరుకు చేరుకుంది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు శభాష్ అంటూ కీర్తిస్తున్నారు. అదేసమయంలో సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఆమెకు ఆహ్వానం అందింది. సైక్లింగ్ ట్రయల్స్‌కు ఆహ్వానించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బీహార్ రాష్ట్రంలోని దర్బంగాకు చెందిన వ్యక్తి తన భార్య, కుమార్తెతో కలిసి ఢిల్లీకి వలస వచ్చారు. వారు ఢిల్లీలోని గురుగ్రామ్‌లో నివసిస్తూ వచ్చారు. ఈ క్రమంలో భార్య చనిపోయింది. దీంతో తన కుమార్తెతో కలిసి ఢిల్లీలోనే ఉంటూ వచ్చారు. అయితే, లాక్డౌన్‌తో వారిద్దరూ ఉపాధిని కోల్పోయారు. దీంతో పూటగడవడం కష్టమైంది. 
 
పైగా, ఇంటి యజమాని గెంటేసేలోగానే వెళ్లిపోవాలని భావించిన జ్యోతి, ప్రమాదంలో గాయపడిన తండ్రిని తీసుకుని స్వగ్రామానికి చేరుకుంది. దీంతో ఈ నెల 10న చేతిలో డబ్బులేని స్థితిలో తన ప్రయాణాన్ని ప్రారంభించిన జ్యోతి, రోజుకు 100 నుంచి 150 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ, 18న దర్బంగా సమీపంలోని స్వస్థలానికి చేరగా, సోషల్ మీడియా ఆమె సాహసానికి హ్యాట్సాఫ్ చెప్పింది. 
 
ఈ క్రమలో 1200 కిలోమీటర్ల దూరంలో ఉన్న సొంతూరుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అంతే.. వికలాంగుడైన తన తండ్రిని వెనుక కూర్చోబెట్టుకున్న ఆ బాలిక సైకిల్ ప్రయాణం ప్రారంభించింది. అలా ఆమె ఏకంగా 1200 కిలోమీటర్లను కేవలం వారం రోజుల్లో చేరుకుంది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆ బాలికను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. 
 
అలాగే, ఈ విషయం తెలుసుకున్న సీఎఫ్ఐ కూడా ఆ బాలికకు బంపరాఫర్ ఇచ్చింది. వెనుక ఒకరిని కూర్చోబెట్టుకుని, అంతదూరం ప్రయాణం చేసిన ఆమె శక్తి, సామర్థ్యాలు, తెగువకు ఆశ్చర్యపోయిన సమాఖ్య, గురువారం ఆమెతో ప్రత్యేకంగా మాట్లాడింది. ట్రయల్స్ కోసం ఢిల్లీకి రావాలని, ట్రయల్స్‌లో సత్తా చాటితే, జాతీయ సైక్లింగ్ అకాడమీలో శిక్షణ ఇస్తామని సమాఖ్య ఛైర్మన్ ఓంకార్ సింగ్ హామీ ఇచ్చారు.