శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 జులై 2020 (11:20 IST)

కోవ్యాగ్జిన్ తొలి ట్రయల్‌కు సర్వంసిద్ధం... ఎక్కడ?

హైదరాబాద్ నగరానికి చెందిన ఫార్మా దిగ్గజ కంపెనీ భారత్ బయోటెక్, భారత వైద్య పరిశోధనా సంస్థ (ఐసీఎంఆర్) సంయుక్త ఆధ్వర్యంలో రూపొందిన కోవ్యాగ్జిన్ తొలి ట్రయల్ కర్నాటక రాష్ట్రంలోని బెలగావిలో ప్రారంభించనున్నారు. 
 
భారత వైద్య పరిశోధన సంస్థ (ఐసీఎంఆర్), నేషనల్ ఇని‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) సహకారంతో భారత్ బయోటిక్ ఈ టీకాను అభివృద్ధి చేసింది. బెలగావిలో దీనిని తొలిసారి పరీక్షించనున్న అధికారులు ఆరోగ్యంగా ఉన్న 200 మంది వలంటీర్ల బృందంపై క్లినికల్ ట్రయల్స్‌కు సిద్ధమయ్యారు. 
 
ఐసీఎంఆర్ పర్యవేక్షణలో ఈ పరీక్షలు జరగనున్నాయని అధికారులు తెలిపారు. ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసి ఆగస్టు 15 నాటికి ఈ టీకాను వినియోగానికి అందుబాటులోకి తీసుకు రావాలని ప్రభుత్వం యోచిస్తోంది.
 
మరోవైపు, కోవ్యాగ్జిన్ టీకాను మానవులపై ప్రయోగించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చి, ఇందుకోసం దేశ వ్యాప్తంగా పలు ఆస్పత్రులను ఎంపిక చేశారు. ఇందులో హైదరాబాద్ నగరంలోని నిమ్స్ ఆస్పత్రి ఒకటి. 
 
ఇక్కడ ఈ నెల ఏడో తేదీ నుంచి కరోనా టీకా క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. నిమ్స్‌లో గతంలో పలు క్లినికల్ ప్రయోగాలు చేపట్టిన నేపథ్యంలో కోవ్యాగ్జిన్ ఫేజ్ 1 ప్రయోగాలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ తెలిపారు. క్లినికల్ ప్రయోగాల కోసం ఐసీఎంఆర్ బడ్జెట్ విడుదల చేసినట్టు చెప్పారు.
 
టీకా ప్రయోగాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఔషధ ప్రయోగాల నైతిక విలువల కమిటీ శనివారం సమావేశమైందని, ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను ఐసీఎంఆర్‌కు నివేదించనున్నట్టు పేర్కొన్నారు. అక్కడి నుంచి అనుమతి రాగానే టీకా ప్రయోగాలు ప్రారంభించనున్నట్టు డాక్టర్ మనోహర్ తెలిపారు.