శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శుక్రవారం, 15 ఫిబ్రవరి 2019 (11:27 IST)

జవాన్ల త్యాగాలను భారత జాతి ఎన్నటికీ మరవదు : పవన్

జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో అవంతిపురా వద్ద జరిగిన ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో 44 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి కోసం ఉగ్రవాదులు ఏకంగా 320 కేజీల పేలుడు పదార్థాలను వినియోగించారు. పేలుడు పదార్థాలతో వచ్చిన ఓ కారు జవాన్లు ప్రయాణిస్తున్న బస్సును ఢీకొట్టడంతో ఈ దారుణం జరిగింది. ఈ ఉగ్రఘాతుకంపై సినీ రంగానికి చెందిన ప్రముఖులు స్పందించారు. ఈ దాడిని రాజ‌కీయాల‌కి అతీతంగా ప్ర‌తి ఒక్క‌రు ఖండించారు. ఉగ్రవాదాన్ని ఓడించడంలో అమెరికా కూడా భారత్‌కు అండగా ఉంటామ‌ని తెలిపింది. అయితే ఇంత‌టి దారుణ‌మైన చ‌ర్య‌ని సినిమా సెల‌బ్రిటీలు కూడా ఖండిస్తున్నారు. 
 
జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, దాడిలో సీఆర్పీఎఫ్ జ‌వాన్లు ప్రాణాలు కోల్పోవ‌డం మ‌న‌సుని క‌లచి వేసింది. మృతుల సంఖ్య పెరుగుతుండ‌డం బాధ‌ని క‌లిగిస్తుంది. అమరవీరులకు నా తరపున, జనసైనికుల తరపున సెల్యూట్ చేస్తున్నాను. వారి త్యాగాలను భారత జాతి ఎన్నటికీ మరవదు. అమరులైన ఆ జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ స్పందిస్తూ, మ‌న‌ల‌ని కంటికి రెప్ప‌లా కాపాడుతున్న జ‌వాన్లు ఉగ్రదాడిలో మ‌ర‌ణించడం మ‌న‌సుని క‌లచి వేసింది. ప్రాణాలు విడిచిన జ‌వాన్ల కుటుంబాల‌కి అండ‌గా నిల‌బ‌డ‌డం మ‌న ధ్యేయం అంటూ పేర్కొన్నారు. 
 
అలాగే, నటి ప్రియాంకా చోప్రా చేసిన ట్వీట్‌లో పుల్వామా ఘ‌ట‌న‌తో ఒక్క‌సారిగా షాక్ అయ్యాను. ద్వేషం ఎప్ప‌టికి స‌మాధానం ఇవ్వ‌దు. ఉగ్ర‌దాడిలో గాయ‌ప‌డ్డ జ‌వాన్ల ఆత్మ‌కి శాంతి క‌లగాల‌ని, వారి కుటుంబాల‌కి ధైర్యం అందించాల‌ని దేవుడిని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు. 
 
మరో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ స్పందిస్తూ, పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ సైనికుల‌పై జ‌రిగిన భీక‌ర దాడి ఇంకా న‌మ్మ‌శక్యంగా లేదు. ఈ ఘ‌ట‌న‌ని ఎప్ప‌టికి మ‌ర‌చిపోలేము. దాడిలో గాయ‌ప‌డ్డ వారు వేగ‌వంతంగా రిక‌వ‌ర్ కావాల‌ని దేవుడిని కోరుకుంటున్నాను. మ‌ర‌ణించిన వారి ఆత్మ‌ల‌కి శాంతి క‌లిగించాల‌ని దేవుడిని ప్రార్థిస్తున్నాను అని చెప్పారు.