శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (12:52 IST)

నా భార్యను విష వలయంలోకి పంపా.. జాగ్రత్తగా చూసుకోండి ప్రియాంకా భర్త

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెల్లి ప్రియాంకా గాంధీ వాద్రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర తూర్పు విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆ తర్వాత ఆమె తన సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి సోమవారం లక్నో వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ యూపీలో ప్రకంపనలు సృష్టించింది. రాహుల్, ప్రియాంకా గాంధీ కలిసి నిర్వహించిన ఈ ర్యాలీకి అనూహ్య స్పందన వచ్చింది. 
 
ఈ నేపథ్యంలో ప్రియాంకా భర్త రాబర్ట్ వాద్రా ఓ ప్రకటన చేశారు. తన భార్యకు శుభాకాంక్షలు తెలుపుతూనే, తన భార్యను విష వలయంలోకి పంపించానని, అందువల్ల ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. 
 
"భారతదేశ ప్రజలకు సేవ చేయడానికి ఉత్తరప్రదేశ్‌లో ఓ కొత్త ప్రయాణం ఆరంభిస్తున్న ప్రియాంకా! నీకు నా శుభాకాంక్షలు. నువ్వు నా బెస్ట్‌ ఫ్రెండ్‌వి, చక్కని భార్యవి, మన పిల్లలకు గొప్ప తల్లివి" అని ఆయన ఓ ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో అభినందించారు. 
 
'కక్షలతో కూడిన విషపూరితమైన రాజకీయ వాతావరణం ఇపుడు నెలకొని ఉంది. కానీ దేశ ప్రజలకు సేవ చేయడం ఆమె బాధ్యత. నేనామెను ఈ దేశ ప్రజలకు అప్పగిస్తున్నాను. ఆమెను జాగ్రత్తగా చూసుకోండి' అని ఆయన భావోద్వేగంతో కూడిన ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. 
 
వాద్రా ఇలాంటి పోస్టే జనవరి 23న కూడా ఒకటి పెట్టారు. ఆమెను ప్రధాన కార్యదర్శిగా రాహుల్‌ నియమించిన రోజున కంగ్రాట్స్‌ చెబుతూ. 'నీ జీవితంలోని ప్రతీ దశలోనూ నేను వెన్నంటి ఉంటా.. ఈ దేశానికి నువ్వు చేయగలిగినంత సేవ, మంచి చెయ్' అంటూ ఆ ట్వీట్‍లో పేర్కొన్నారు. వాద్రా చేసిన ఈ ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.