గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 25 మార్చి 2020 (07:41 IST)

కిరణా సరుకులకు ఆందోళన వద్దు.. పరుగులు తీయొద్దు.. ప్రధాని విజ్ఞప్తి

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ నుంచి విముక్తి పొందేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇందులోభాగంగా, 24వ తేదీ అర్థరాత్రి నుంచి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం రాత్రి జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
 
ఆ తర్వాత ఆయన రాత్రి 11 గంటల సమయంలో తన ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్లు చేసారు. కరోనా వైరస్ వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం తరపున అన్ని చర్యలూ తీసుకుంటున్నట్టు చెప్పారు. 
 
ముఖ్యంగా, "నిత్యావసర వస్తువుల నిమిత్తం షాపుల వద్ద గుమికూడితే, కొవిడ్-19 వ్యాప్తికి కారణమవుతారు. ఏకకాలంలో షాపులకు పరుగులు తీయవద్దు. ఇళ్లలోనే ఉండండి. మీకు కావాల్సిన అన్ని నిత్యావసరాలను అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తున్నాం" అని ఆయన అన్నారు.
 
అలాగే, "నేటి సాయంత్రం నేను దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న వైద్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లతో సమావేశం అయ్యాను. జాతి ఆరోగ్యం కోసం వారు చేస్తున్న కృషికి నా కృతజ్ఞతలు" అన్నారు. దాని తరువాత, "డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, వారి అనుభవాలతో కొవిడ్-19తో పోరాడుతున్నారు. ప్రతి పౌరుడి ఆరోగ్య సంరక్షణ తమ బాధ్యతగా వారు స్వీకరించారు. వారు చేస్తున్న కృషికి భారతావని సెల్యూట్ చేస్తోంది" అని అన్నారు.