గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : గురువారం, 7 ఫిబ్రవరి 2019 (15:22 IST)

బీజేపీ నేతల ప్రెస్‌మీట్లకు హెల్మెట్లు ధరించి వెళుతున్న జర్నలిస్టులు!

సాధారణంగా ద్విచక్ర వాహనం నడిపే సమయంలో మాత్రమే హెల్మెట్లు ధరిస్తుంటారు. ప్రమాదవశాత్తు కిందపడినా తలకు రక్షణగా ఉండేందుకు హెల్మెట్లు ధరిస్తుంటారు. అంతేకాకుండా రోడ్డు ప్రమాదాల మృతుల సంఖ్యను కూడా తగ్గించేందుకు నిర్బంధ హెల్మెట్లు ధరించాలని ప్రభుత్వాలతో పాటు పలు కోర్టులు ఆదేశాలు జారీచేశాయి. 
 
అయితే, ఇపుడు భారతీయ జనతా పార్టీ నేతలు ఏర్పాటు చేసే ప్రెస్‌మీట్లకు విధిగా హెల్మెట్లు పెట్టుకుని వెళ్లాలని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో పనిచేసే జర్నలిస్టులు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే.. వీరంతా అదే పని చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ నేతల మీడియా సమావేశానికి శిరస్త్రాణం తప్పనిసరిగా ధరిస్తున్నారు. ఒకరిద్దరు కాదు విలేఖరులంతా దీన్నీ ఫాలో అవుతున్నారు. వీళ్లు ఎందుకిలా చేస్తున్నారో తెలుసుకుందాం.
 
ఇటీవల ఆ రాష్ట్ర బీజీపీ నేతల సమావేశం జరిగింది. ఇందులో రాష్ట్ర, జిల్లా, బూతు స్థాయి నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని కవరేజ్ చేసేందుకు మీడియా మిత్రులు అక్కడకు వెళ్లారు. అంతా సక్రమంగా సాగుతుందనుకున్న తరుణంలో బీజేపీ నేతల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. 
 
ఆ దృశ్యాలను 'ది వాయిసెస్' అనే డిజిటల్ పోర్టల్‌కు చెందిన రిపోర్టర్ సుమన్ పాండే తన మొబైల్ ఫోన్ కెమెరాలో రికార్డ్ చేశాడు. అయితే, ఆ వీడియోను డిలీట్ చేయాలంటూ బీజేపీ నేతలు అతడితో గొడవకు దిగారు. మరికొందరు నేరుగా వచ్చి సుమన్ పాండేపై దాడికి పాల్పడ్డారు. అందరూ మూకుమ్మడిగా దాడి చేయడంతో అతడి తలకు గాయాలయ్యాయి.
 
ఈ దాడిపై జర్నలిస్టు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాయ్‌పూర్‌లోని ఛత్తీస్‌గఢ్ బీజేపీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగాయి. జర్నలిస్ట్‌ల ఫిర్యాదుతో బీజేపీ రాయ్‌పూర్ సిటీ అధ్యక్షుడు రాజీవ్ అగర్వాల్‌తో మరికొందరు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం జరిగిన ఘటనపై బీజేపీ అధికార ప్రతినిధి సచ్చిదానంత ఉపాసనె క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ జర్నలిస్టులు మాత్రం తమ నిరసన కొనసాగిస్తున్నారు. బీజేపీ ప్రెస్‌మీట్‌లకు వెళ్లినప్పుడు హెల్మెట్‌లు ధరించి వెళుతున్నారు. ఎవరు ఎపుడు దాడి చేస్తారో తెలియదని, తమ ఆత్మరక్షణ కోసం నిర్బంధ శిరస్త్రాణాం ధరించక తప్పదని జర్నలిస్టులు చెబుతున్నారు.