శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Modified: శుక్రవారం, 7 జూన్ 2019 (14:01 IST)

సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇలా మారిపోయారేమిటి?

2014 ఎన్నికలు జరిగిన తర్వాత వైసీపీని వీడి వచ్చి తెదేపాలో చేరిన ఎమ్మెల్యేలు చెప్పిన మాట... జగన్ మోహన్ రెడ్డి మనస్తత్వం ఒంటెద్దు పోకడ అన్నది. నిజానికి జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు వారు చెప్పేదానికి ఎక్కడా పొంతన కుదరడం లేదు. ఇక అసలు విషయానికి వస్తే... రేపు 8వ తేదీన నూతన మంత్రివర్గం ఏర్పాటు కానుంది. ఈ మంత్రిమండలిలో 25 మందికి జగన్ మోహన్ రెడ్డి చోటు కల్పించబోతున్నారు.
 
ఈ సందర్భంగా ఎమ్మెల్యేలందరితో ఆయన భేటీ అయ్యారు. గత పదేళ్లుగా తన వెన్నంటే వుండి కష్టనష్టాలను లెక్కచేయకుండా వున్నారంటూ కాస్త భావోద్వేగానికి గురయ్యారు. అంతేకాదు... ఎమ్మెల్యేగా ఎన్నికైనవారిలో అన్ని సమీకరణాలను అనుసరించి మంత్రి పదవులను ఇస్తున్నట్లు చెప్పారు. 151 మందిలో అందరికీ మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యం కాదన్నది మీకు తెలుసు... రెండున్నరేళ్లపాటు 25 మందికి, మరో రెండున్నరేళ్లపాటు మరో 25 మందికి ఇవ్వడం ద్వారా 50 మందికి మంత్రి పదవులిచ్చినట్లవుతుందన్నారు.
 
ఐతే మంత్రి పదవులు దక్కనివారు ఎలాంటి నిరుత్సాహానికి గురి కావద్దనీ, పార్టీలో వారి పాత్ర చాలా కీలకంగా మారుతుందన్నారు. మంత్రులు, పార్టీలో కోసం పనిచేస్తున్న ఎమ్మెల్యేలు అంతా తనకు రెండు కళ్లులాంటివారనీ, ఎవరికీ అన్యాయం జరగకుండా పూర్తిగా న్యాయం చేస్తానని ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి అందరినీ ఒప్పించేందుకు చేసిన ప్రయత్నంపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. జగన్ మోహన్ రెడ్డి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందని నాయకులు ఖుషీ అవుతున్నారు.